బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ కు భారత్ పై అద్భుతమైన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం దక్కింది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ తన 4ఓవర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి మూడు బిగ్ వికెట్లను తీశాడు. అలాగే చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4ఓవర్లలో కేవలం 15పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. రెండో టీ20లో గ్లీసన్ బౌలింగ్ ప్రదర్శనను మోర్గన్ ప్రశంసించాడు. గ్లీసన్ కు మంచి ఫ్యూచర్ ఉందని.. 2023లో భారత్ లో జరిగే వన్డే ప్రపంచకప్ కు ఇంగ్లాండ్ జట్టు అతన్ని సిద్ధం చేయాలని సూచించాడు. గ్లీసన్ అరంగేట్రం గొప్పగా జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లాండ్ కు మరో పేసర్ దొరికాడు. కౌంటీల్లో బాగా రాణించి ఇంగ్లాండ్ కు ఎంపికైన గ్లీసన్.. తొలి మ్యాచ్ లోనే కోహ్లి, పంత్, రోహిత్ శర్మలను అవుట్ చేశాడు. ఇది అసాధారణమైన ప్రదర్శన. ఇంగ్లిష్ క్రికెట్ కు అతనో గొప్ప అన్వేషణ అనే చెప్పాలి. వచ్చే ఏడాది భారతదేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ కోసం అతన్ని జట్టు మేనేజ్ మెంట్ సిద్ధం చేయాలి అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. బంతితో గ్లీసన్ రాణించినప్పటికీ.. టీమిండియా ఈ మ్యాచ్ ను సునాయాసంగా గెలుచుకుంది. తొలుత నిర్ణీత 20ఓవర్లలో 170పరుగులు చేసిన ఇండియా.. 171పరుగుల లక్ష్యాన్ని ఈజీగా కాపాడుకోగలిగింది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో స్వింగ్ ద్వారా విధ్వంసం సృష్టించాడు. అతను ఓపెనర్లు జాసన్ రాయ్, కెప్టెన్ జోస్ బట్లర్ ఇద్దరి వికెట్లను పడగొట్టి ఇండియాకు మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఇక తదనంతరం ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 49పరుగుల తేడాతో ఓటమి పాలయింది. నేడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.