మరో నాలుగు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 2న మొదలయ్యే ఈ టోర్నీకి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మహా సమరంలో మునుపెన్నడూ లేని విధంగా ఇరవై దేశాలు బరిలోకి దిగుతున్నాయి. వీటన్నింటినీ అయిదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ స్టేజ్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి.
సూపర్-8కు క్వాలిఫై అయిన ఎనిమిది జట్లను మళ్లీ రెండు గ్రూప్లుగా ఏర్పాటు చేస్తారు. వీటిలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయి. సెమీస్లో గెలిచిన జట్లు జూన్ 29న బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ మెగాటోర్నీలో డిఫెండిగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, ఆతిథ్య జట్టు వెస్టిండీస్, ఆస్ట్రేలియా, భారత్ ఫేవరేటుగా బరిలోకి దిగుతున్నాయి.

అయితే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా విజేతగా నిలుస్తుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. భారత జట్టు బలోపేతంగా ఉందని, ఆటగాళ్లు గాయపడినా గెలుస్తుందని పేర్కొన్నాడు. ''టోర్నీ అంతటా గాయాలతో బాధపడినా టీమిండియానే విజేతగా నిలుస్తుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భారత్ బలం, లోతుగా అద్భుతంగా ఉంది. అంతలా నాణ్యమైన ప్లేయర్లు ఉండటంతో భారత జట్టులో చోటు సంపాదించని వాళ్ల గురించి మాట్లాడుతున్నాం'' అని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.
కాగా, టీమిండియా గ్రూప్-ఏలో ఉంది. భారత్తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, ఆతిథ్య జట్టు అమెరికా ఉన్నాయి. గ్రూప్-ఏ మ్యాచ్లన్నింటికీ అమెరికానే ఆతిథ్యం ఇస్తుంది. భారత కాలమాన ప్రకారం టీమిండియా మ్యాచ్లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్