హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. బీసీసీఐ ఆదేశాల మేరకు భారత్, బంగ్లాదేశ్ టెస్టులో ప్రతి రోజు 5000 మంది పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చే స్కూలు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్న ప్రచారంతో ఎంతో మంది విద్యార్థులు, తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు గాను ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి వచ్చారు. అయితే స్టేడియం సిబ్బంది వీరిని లోపలికి పంపేందుకు నిరాకరించారు.
అధికారుల నిర్వాకంతో స్కూలు పిల్లలు ఎండలో మాడుతున్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులు రాలేదని, దరఖాస్తు లేఖలు తేలేదని ఇలా కుంటిసాకులు చెబుతూ, విద్యార్థులను ఎండలో నిలిపారు. స్టేడియం సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు మీడియాలో ప్రసారం కావడంతో అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టెస్టు మ్యాచ్ని చూసేందుకు పాఠశాల విద్యార్దులను స్టేడియంలోకి పంపాలని మ్యాచ్ చూసేందుకు వచ్చిన పలువురు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఓ చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత పర్యటకు వచ్చిన బంగ్లాదేశ్ ఏకైక టెస్టు హైదరాబాద్లో జరుగుతుండటం విశేషం.
ఉప్పల్ స్టేడియంలో 2010లో తొలిసారిగా జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత 2013లో ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 135 పరుగుల భారీవిజయం సాధించింది. మళ్లీ మూడేళ్ల విరామ తర్వాత ఇక్కడ జరుగుతున్న టస్టు మ్యాచ్ ఇదే.
ఉప్పల్ పిచ్ మొదటి నాలుగు రోజులూ బ్యాటింగ్కు అనువుగా ఉండటం ఖాయమని, దీంతో టాస్ ప్రభావం అంతంత మాత్రమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ టెస్టుకు భారీభద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.
స్టేడియంలోకి క్రికెట్ అభిమానులు ఎలాంటి వస్తువులను వెంట తీసుకురావద్దని పోలీసులు సూచించారు. బ్యాగులు, బ్యానర్లు, కెమెరాలు, బైనాక్యులర్స్, అగ్గిపెట్టెలు, లైటర్స్, హెల్మెట్స్, సిగరెట్స్, ఇతర తినుబండారాలు, నీళ్ల బాటిళ్లు లోనికి అనుమతించమని తెలిపారు. సెల్ఫోన్లను మాత్రం అనుమతిస్తున్నట్లు తెలిపారు.