
మే 30 నుండి ఇంగ్లాండ్ మరియు వేల్స్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2019 ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు 15 మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాయి. ఈ ప్రపంచకప్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. లండన్లోని ఐకానిక్ ది ఓవల్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనుంది.
ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా మూడు వారాలే ఉంది. సమయం దగ్గరపడుతుండడంతో ఆయా జట్లు జెర్సీలను ఆవిష్కరించే పనిలో పడ్డాయి. బంగ్లాదేశ్ ఇప్పటికే తన కొత్త జెర్సీని ప్రకటించగా.. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తమ జెర్సీని ఆవిష్కరించింది. అయితే లంక వైవిధ్యంగా సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన జెర్సీని తీసుకొచ్చింది.
శ్రీలంక రూపొందించిన పర్యావరణ రహిత జెర్సీ.. ప్రజల్లో పర్యావరణంపై ఆలోచనలు రేకెత్తించేలా చేస్తోంది. లంక బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ క్రికెట్ అభిమానులు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్లో ఆడే లంక ఆటగాళ్లంతా ఈ జెర్సీనే వినియోగించనున్నారు. శ్రీలంక 1996లో ప్రపంచకప్ తొలిసారి గెలిచుకుంది. అనంతరం 2007, 2011లో ఫైనల్కు చేరినా.. ఆస్ట్రేలియా, భారత్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది.