
ప్రపంచకప్లో భాగంగా లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేసాడు. స్టోయినిస్ వేసిన 33వ ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ప్రపంచకప్-2019లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ధావన్ 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసాడు. ఐసీసీ టోర్నమెంట్ లలో ధావన్కు ఇది ఆరో సెంచరీ. మరోవైపు ప్రపంచకప్లో మూడో సెంచరీ. ఇక వన్డేలలో 17వ సెంచరీ.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ధావన్ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. సెంచరీ అనంతరం బౌండరీలు బాదుతూ.. ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. మొదటి నుంచి బౌండరీలతో డీల్ చేస్తున్న ధావన్.. 52 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసాడు. అనంతరం కౌల్టర్ నైల్ వేసిన 23వ ఓవర్ మూడో బంతిని కీపర్ కేరీకి సునాయాస క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 127 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
రోహిత్ ఔట్ అయినా.. ధావన్ తన దూకుడు మాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే సెంచరీ చేసాడు. మరో ఎండ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచిచూచి ఆడుతూ ధావన్కు చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఈ జోడి ఇప్పటికే 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో ప్రస్తుతం భారత్ మెరుగైన స్థితిలో ఉంది. క్రీజులో శిఖర్ ధావన్ (112), విరాట్ కోహ్లీ (38)లు ఉన్నారు. ప్రస్తుతం భారత్ 36 ఓవర్లలలో ఒక వికెట్ నష్టానికి 213 పరుగులు చేసింది.