న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ వివాదాస్పద వ్యాఖ్యాలతో వార్తల్లోకెక్కాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంగ్లండ్ విజయావకాశాలపై స్వాన్ మీడియాతో మాట్లాడాడు.
మోంటీ పనేసర్తో కలిసి ఇంగ్లాండ్ జట్టుకు దీర్ఘకాలం సేవలందించిన ఈ మాజీ స్పిన్నర్ ఇంగ్లాండ్ గడ్డపై స్పిన్నర్ల పట్ల వ్యవహరించే తీరుపై మండిపడ్డారు. ఇంగ్లాండ్లో స్పిన్ నిరాదరణకు గురైందని, అసలు దేశంలో స్పిన్నర్లను గుర్తించడం లేదని విమర్శలు గుప్పించాడు.

ఇంకో అడుగు ముందుకేసి ఇంగ్లాండ్లో స్పిన్నర్లను మూడో తరగతి ప్రజలుగా పరిగణిస్తారని చెప్పుకొచ్చాడు. దీని వల్లే ఇంగ్లాండ్ క్రికెటర్లు స్పిన్పై అంతగా ఆసక్తి కనబరచపోవడానికి కారణమని పేర్కొన్నాడు. 2012లో జరిగిన టెస్టు సిరిస్లో ఇంగ్లాండ్ జట్టు 2-1తో భారత్పై విజయం సాధించడంలో స్వాన్ కీలక పాత్ర పోషించాడు.
'మాకు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉండరు. అందుకు కారణం మమ్మల్ని ట్రీట్ చేసే విధానమే. మాకు ఉపయోగపడని మంచి జట్టుతో పాటు ఉపయోగపడని మంచి క్రికెటర్లు కూడా ఉంటారు. దాంతో భారత్తో జరుగబోయే సిరీస్లను కోల్పోతాం. మూడో తరగతికి చెందిన క్రికెటర్ల తరహాలో చూస్తారు. కారణం స్పిన్నర్లను చిన్నచూపు చూడటమే' అని స్వాన్ మండిపడ్డాడు.