రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన రసెల్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20లో ఒంటిచేత్తో వెస్టిండీస్ ను గెలిపించాడు. తొలుత బంతితో ఇంగ్లాండ్ ను దెబ్బతీసిన రసెల్.. తర్వాత బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. అయిదు టీ20ల సిరీస్ లో భాగంగా బ్రిడ్జ్ టౌన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. అయితే ఇంగ్లాండ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు సాల్ట్ (40), బట్లర్ (39) తొలి వికెట్ కు 77 పరుగులు జోడించారు. బట్లర్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరే సమయానికి ఇంగ్లాండ్ 10.5 ఓవర్లలో 117 పరుగులతో 200 స్కోరును అందుకునేలా కనిపించింది.

కానీ రసెల్, అల్జారీ జోసెఫ్ చెలరేగడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. లివింగ్ స్టోన్ మినహా ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. నాలుగు ఓవర్లు వేసిన రసెల్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. జోసెఫ్ 3.3 ఓవర్లలో 54 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. షెఫార్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
తర్వాత ఛేదనలో వెస్టిండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (22), మేయర్స్ (35) ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించారు. అయితే వెస్టిండీస్ ప్లేయర్లు కుదురుకున్న కాసేపటికే వికెట్లను చేజార్చుకుంటూ పెవిలియన్ కు చేరారు. 14.4 ఓవరల్లో ఆరు వికెట్లు కోల్పోయి 123 పరుగులతో విండీస్ కష్టాల్లో పడింది.
అయితే కెప్టెన్ పావెల్ (31*)తో కలిసి రసెల్ (29*) ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుసగా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. 18.1 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించారు. బ్రిడ్జ్ టౌన్ లో ఇప్పటివరకు జరిగిన టీ20 మ్యాచ్ ల్లో అత్యధిక ఛేదన స్కోరు ఇదే. కాగా, రసెల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.