వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ మరో మ్యాచ్లో ఓటమిపాలైంది. రెండో టీ20లో పది పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో అయిదు టీ20ల సిరీస్లో 0-2తో ఇంగ్లాండ్ వెనుకంజలో ఉంది. మూడో టీ20 శనివారం జరగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ పావెల్ (50)తో కలిసి ఓపెనర్ బ్రాండన్ (82) ఆదుకున్నాడు. అయిదో వికెట్కు వీరిద్దరు 80 పరుగులు జోడించారు.

అయితే ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. ఆదిలోనే కెప్టెన్ బట్లర్ (5) వెనుదిరిగాడు. సాల్ట్ (25)తో కలిసి జాక్స్ (24) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా కుదరలేదు. వెస్టిండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. సామ్ కరన్ (50), మొయిన్ అలీ (22*) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రం తగ్గించగలిగింది.
అయితే వెస్టిండీస్ ఇన్నింగ్స్లోని ఆఖరి ఓవర్లో ఫన్నీఇన్సిడెంట్ జరిగింది. మిల్స్ వైడ్లైన్ మీదగా వేసిన బంతిని రసెల్ సిక్సర్గా బాదాడు. అయితే షాట్ ఆడిన తర్వాత బ్యాలెన్స్ ఆపుకోలేక రసెల్ బొక్కబోర్ల పడ్డాడు. అయితే ఇలాంటి షాట్స్, ఇలాంటి పవర్ రసెల్కు మాత్రమే సొంతమని కామెంటరీ చేసే వ్యాఖ్యాతలు ఆ టైమ్ లో అన్నారు.
కాగా, రెండేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన రసెల్ ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20లో ఒంటిచేత్తో వెస్టిండీస్ ను గెలిపించిన సంగతి తెలిసిందే. నాలుగు ఓవర్లు వేసిన రసెల్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్లో అజేయంగా 29 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్లో 14 పరుగులు చేసిన రసెల్ బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి 66 పరుగులు సమర్పించుకున్నాడు.