మాంచెస్టర్: మొదటి టెస్టుకు ఆటంకం కలిగించిన వరుణుడు.. రెండో టెస్టుకు కూడా ఆడ్డుపడుతున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటికే ఆరంభంకావాల్సిన రెండో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. మ్యాచ్ సమయానికి ముందు నుంచే చిరు జల్లులు కురుస్తుండటంతో.. మైదానం చిత్తడిగా మారింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యంకానుంది.
ప్రస్తుతం ఓల్డ్ ట్రాఫోర్డ్లో వర్షం తగ్గింది. అయితే పిచ్పై మాత్రం కవర్లు కప్పి ఉంచారు. సిబ్బంది మైదానంను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. టాస్ భారత కాలమానం ప్రకారం 5 గంటలకు వేసే అవకాశం ఉంది. అప్పటిలోగా వరుణుడి కనికరిస్తే టాస్ పడి.. మ్యాచ్ మొదలవనుంది. ఈ లోగా మళ్లీ వర్షం పడితే మరికొంత సమయం పట్టనుంది. మొదటి టెస్ట్ సమయంలో కూడా వర్షం కారణంగా తొలి రోజు కేవలం 17 ఓవర్ల పాటు మాత్రమే ఆట సాగిన విషయం తెలిసిందే.
Wet weather has delayed the toss in Manchester ☂️ #ENGvWI pic.twitter.com/NfyNezOaP6
— ICC (@ICC) July 16, 2020
కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠరేపడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాకిచ్చిన విండీస్.. మూడు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంతో నిలిచింది. రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని విండీస్ చూస్తుండగా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగనుంది.
వెస్టిండీస్తో రెండో టెస్టుకు తుది జట్టులో ఉన్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బయో సెక్యూర్ ప్రొటోకాల్స్ను ఉల్లంఘించాడు. దీంతో ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనిపై వేటు వేసింది. బయో సెక్యూర్ ప్రొటోకాల్స్ను ఉల్లంఘించాడని మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు అతన్ని పక్కనపెట్టేశారు. ఆటగాళ్ల భద్రత కారణంగానే ఆర్చర్ను జట్టు నుంచి తప్పించామని ఈసీబీ తెలిపింది. అయితే ఆర్చర్ ఏ నిబంధనలను బ్రేక్ చేశాడనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆర్చర్ స్థానంలో ఎవరిని తుది జట్టుకు ఎంపిక చేశారనే విషయాన్నికూడా వెల్లడించలేదు. టాస్ సమయంలో కెప్టెన్ జో రూట్ అసలు విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
వైరల్ వీడియో.. వర్షంలో చిన్నపిల్లాడిలా సచిన్ ఆటలు!!