
మాంచెస్టర్: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కరేబియన్ పేసర్లు చెలరేగుతున్నారు. పిచ్పై ఉన్న తడిని ఉపయోగించుకుని కీలక మూడు వికెట్లు పడగొట్టారు. ఆపై ఇంగ్లీష్ బ్యాట్స్మన్లు పట్టుదల ప్రదర్శించి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. తొలిరోజు టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 46 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. క్రీజులో బెన్ స్టోక్స్ (18), డొమినిక్ సిబ్లీ (46) ఉన్నారు. రోస్టన్ ఛేజ్ 2, అల్జారి జోసెఫ్ 1 వికెట్ తీశారు.
మ్యాచ్ సమయానికి ముందు చిరు జల్లులు కురవడంతో.. మైదానం చిత్తడిగా మారింది. దీంతో టాస్ రెండు గంటలు ఆలస్యం అయింది. అనంతరం టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం పడి పిచ్ తడిగా ఉండడంతో విండీస్ బౌలర్లు విసిరే బంతులను ఇంగ్లీష్ బ్యాట్స్మన్లు ఆచితూచి ఆడారు. దీంతో స్కోరు బోర్డు ముందుకు సాగలేదు. రోచ్, గాబ్రియేల్, జోసెఫ్, హోల్డర్లు వికెట్లు తీయలేకపోయారు.
రంగంలోకి దిగిన రోస్టన్ ఛేజ్ తొలి వికెట్ పడగొట్టాడు. ఓపెనర్ రోరీ బర్న్స్ (15) 14వ ఓవర్ రెండో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బంతికి జాక్ క్రాలే డకౌట్ అయ్యాడు. దీంతో విండీస్ రెండు వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ సిబ్లీకి కెప్టెన్ జో రూట్ జతకలిశాడు. ఇద్దరు కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పక.. రూట్ (23) జోసెఫ్ చేతికి చిక్కాడు. అనంతరం బెన్ స్టోక్స్ అండతో సిబ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.
రెండో టెస్టుకు తుది జట్టులో ఉన్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బయో సెక్యూర్ ప్రొటోకాల్స్ను ఉల్లంఘించాడు. దీంతో ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనిపై వేటు వేసింది. బయో సెక్యూర్ ప్రొటోకాల్స్ను ఉల్లంఘించాడని మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు అతన్ని పక్కనపెట్టేశారు. ఆటగాళ్ల భద్రత కారణంగానే ఆర్చర్ను జట్టు నుంచి తప్పించామని ఈసీబీ తెలిపింది. అయితే ఆర్చర్ ఏ నిబంధనలను బ్రేక్ చేశాడనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.