
కొలొంబో: ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో శ్రీలంక జట్టు ఘోర పరాభవం చవిచూసిన విషయం తెలిసిందే. ఈ పరాజయాలను లంక అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సౌతాంప్టన్లో శనివారం జరిగిన చివరి మ్యాచ్లోనూ ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో శ్రీలంక వైట్వాష్ అయింది. టీ20ల్లో శ్రీలంకకు ఇది వరుసగా ఐదో సిరీస్ ఓటమి. అంతకుముందు కూడా లంక భారీ ఓటములను మూటగట్టుకుంది. ఒక్క సిరీస్లో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అన్ని విభాగాల్లో లంక పూర్తిగా తేలిపోయింది.
వరుస ఓటములతో విసిగిపోయిన శ్రీలంక అభిమానులు సోషల్ మీడియాలో తమ జట్టు ఆటగాళ్లకు వ్యతిరేకంగా హ్యాష్ట్యాగ్ 'అన్ఫాలో క్రికెటర్స్' (#unfollowcricketers) పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఫేస్బుక్లో శనివారం నుంచి ఇది విపరీతంగా ట్రెండ్ అయింది. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, ఓపెనర్ ధనుష్క గుణతిలక ఫేస్బుక్ పేజీలను వేలాదిమంది అభిమానులు బాయ్కాట్ చేశారు. లంక క్రికెటర్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లను అన్ఫాలో చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగింది. ప్రస్తుతం నెట్టింట ఈ విషయమే వైరల్ అవుతోంది.
శ్రీలంక ఆడే మ్యాచ్లను టీవీలలో వీక్షించవద్దంటూ అభిమానులు మీమ్స్ షేర్ చేసుకున్నారు. గత 30 ఏళ్లలో శ్రీలంక ఇంత చెత్తగా ఎప్పుడూ ఆడలేదని అభిమానులు మండిపడుతున్నారు. 'శ్రీలంక జట్టులోని విఫల క్రికెటర్లను అన్ఫాలో చేయండి' అని అహ్మద్ ఇనాములాక్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఉవ్వెత్తున సాగుతున్న ప్రచారంపై లంక బోర్డు సభ్యులు ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే శ్రీలంక క్రికెట్ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకొని కాపాడాలని మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య సూచించాడు.
ఇంగ్లండ్లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్ను ఒక్కటి కూడా గెలవకుండానే ఓటమిపాలైంది. ముఖ్యంగా శనివారం రాత్రి జరిగిన మూడో మ్యాచ్లో లంక 181 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇంగ్లండ్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తమ చరిత్రలో పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి టీ20లో 129/7 స్కోర్ చేసిన లంక.. రెండో టీ20లో 111/7 స్కోర్ సాధించింది. మూడో మ్యాచ్లో 91 పరుగులకే ఆలౌటవ్వడంతో అభిమానులు విమర్శలు చేస్తున్నారు.