
మ్యాచ్ రిఫరీకి పాజిటివ్:
మూడు టీ20లతో పాటు మూడు వన్డేల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తోంది శ్రీలంక జట్టు. పొట్టి సిరీస్ శనివారంతో ముగిసిపోయింది. మూడో మ్యాచులో కూడా గెలుపొందిన ఇంగ్లీష్ జట్టు 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో మ్యాచ్ రిఫరీ ఫిల్ విట్టికేస్ పాల్గొన్నాడు. అతడికి ఆదివారం కరోనా నిర్ధరణ అయింది. మ్యాచ్ రిఫరీకి మహమ్మారి లక్షణాలేమీ లేనప్పటికీ వైరస్ బారిన పడ్డారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. రిఫరీ ఫిల్ విట్టికేస్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, అతడు 10 రోజులు క్వారంటైన్లో ఉంటాడని ఈసీబీ తెలిపింది.

రిఫరీతో సన్నిహితంగా మరో ఏడుగురు:
ఫిల్ విట్టికేస్ టీ20 సిరీస్లోని మూడు మ్యాచ్లలో రిఫరీగా వ్యవహరించారు. ఆ సమయంలో మ్యాచ్ అధికారులు మరియు అవినీతి నిరోధక యూనిట్ సభ్యులు ఏడుగురు అతడితో సన్నిహితంగా ఉన్నారట. దాంతో వారందరు కూడా 10 రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. జూన్ 29న ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య జరిగే మొదటి వన్డేలో అధికారికంగా వ్యవహరించాల్సి ఉంది. ఇప్పుడు వీరందరూ క్వారంటైన్లో ఉండడంతో.. ప్రత్యామ్యాయం కోసం ఈసీబీ చూస్తోంది. ఇక ఇరుజట్ల ఆటగాళ్లు సురక్షితంగానే ఉన్నా.. సిరీస్ సజావుగా జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టూర్ అనంతరం స్వదేశంలో భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ శ్రీలంక ఆడనుంది.

91 పరుగులకే ఆలౌట్:
ఇంగ్లండ్లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్లో ఒక్కటి కూడా గెలవకుండానే ఓటమిపాలైంది. శనివారం రాత్రి జరిగిన మూడో మ్యాచ్లో లంక 181 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇంగ్లండ్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తమ చరిత్రలో పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి టీ20లో 129/7 స్కోర్ చేసిన లంక.. రెండో టీ20లో 111/7 స్కోర్ సాధించింది. ముఖ్యంగా మూడో మ్యాచ్లో 91 పరుగులకే ఆలౌటవ్వడంతో అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

అన్ఫాలో క్రికెటర్స్:
వరుస ఓటములతో విసిగిపోయిన శ్రీలంక అభిమానులు సోషల్ మీడియాలో తమ జట్టు ఆటగాళ్లకు వ్యతిరేకంగా హ్యాష్ట్యాగ్ 'అన్ఫాలో క్రికెటర్స్' (#unfollowcricketers) పేరుతో ప్రచారం ప్రారంభించారు. ఫేస్బుక్లో శనివారం నుంచి ఇది విపరీతంగా ట్రెండ్ అయింది. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, ఓపెనర్ ధనుష్క గుణతిలక ఫేస్బుక్ పేజీలను వేలాదిమంది అభిమానులు బాయ్కాట్ చేశారు. లంక క్రికెటర్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లను అన్ఫాలో చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగింది. శ్రీలంక ఆడే మ్యాచ్లను టీవీలలో వీక్షించవద్దంటూ అభిమానులు మీమ్స్ షేర్ చేసుకున్నారు. 'శ్రీలంక జట్టులోని విఫల క్రికెటర్లను అన్ఫాలో చేయండి' అని అహ్మద్ ఇనాములాక్ అనే అభిమాని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications












