PAK vs ENG: శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 మ్యాచ్ ఊహించని వివాదానికి కేంద్రబిందువైంది. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఈ కీలక పోరులో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. అయితే మైదానంలో ఆటగాళ్ల మధ్య పోరు ముగియగానే.. గ్యాలరీలోని ఫ్యాన్స్ మధ్య అసలైన యుద్ధం మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఇరు జట్ల మద్దతుదారులు ఒకరిపై ఒకరు భౌతిక దాడికి దిగడం క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
అభిమానుల మధ్య బాహాబాహీ
మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియంలోని స్టాండ్స్లో ఇంగ్లాండ్ అభిమాని, పాకిస్థాన్ మద్దతుదారుడి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వివాదం కాస్తా ముదిరి ఒకరినొకరు నెట్టుకోవడం కొట్టుకునే స్థాయికి చేరింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పక్కనే ఉన్న శ్రీలంక అభిమానులు వెంటనే స్పందించి వారిద్దరినీ విడదీయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఆస్ట్రేలియన్ ఇన్ఫ్లుయెన్సర్ జేక్ జెన్నింగ్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్గా మారింది.

"సీరియల్ అఫెండర్" అని ఇన్ఫ్లుయెన్సర్ విమర్శ
వీడియోను షేర్ చేసిన జేక్ జెన్నింగ్స్.. ఈ గొడవలో ఉన్న పాకిస్థాన్ అభిమాని సౌద్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అతడిని ఒక "సీరియల్ అఫెండర్" (వరుసగా తప్పులు చేసే వ్యక్తి) అని సంబోధిస్తూ.. టోర్నమెంట్లో అతను ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం ఇది మొదటిసారి కాదని పేర్కొన్నాడు. "పిచ్చి పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది" అంటూ ఘాటుగా స్పందించిన జెన్నింగ్స్.. ఇలాంటి వ్యక్తులపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పరస్పర ఆరోపణలు.. అసలు కారణం ఏంటి?
ఈ గొడవపై సదరు పాకిస్థాన్ అభిమాని సౌద్ తన వివరణ ఇచ్చాడు. ఇంగ్లాండ్ అభిమాని తనను కావాలనే రెచ్చగొట్టాడని.. తన వైపు బీర్ బాటిళ్లను విసిరి అసభ్యంగా ప్రవర్తించాడని అతను ఆరోపించాడు. తన ఆత్మరక్షణ కోసమే తాను ప్రతిఘటించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే, వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం గొడవ తీవ్ర స్థాయిలో ఉండటం, స్థానిక ప్రేక్షకులు వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించడం కనిపిస్తోంది. స్టేడియంలో భద్రతా ఏర్పాట్లపై కూడా ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
పాకిస్థాన్ సెమీస్ అవకాశాలకు గండం
ఒకవైపు మైదానం బయట ఇలాంటి గొడవలు జరుగుతుంటే.. మైదానంలో పాకిస్థాన్ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. సూపర్-8 దశలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో పాక్ జట్టు కనీసం ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. న్యూజిలాండ్తో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం ఆ జట్టు సెమీస్ ఆశలను దెబ్బతీసింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తన తర్వాతి మ్యాచ్లో శ్రీలంకపై పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.