
బర్మింగ్హామ్: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఎడ్జ్బాస్టన్ వేదికగా జులై 13న జరిగే ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచ్కు స్టేడియం సామర్థ్యంలో 80% మంది అభిమానులను అనుమతించనున్నారు. బ్రిటన్ ప్రభుత్వ కార్యక్రమాల పరిశోధన (ఈఆర్పీ)లో భాగంగా అభిమానులను మైదానంలోకి అనుమతిస్తున్నారు. పరిశోధనలో భాగంగా దాదాపు 19వేల మంది అభిమానులను భౌతిక దూరంతో సంబంధం లేకుండా ఎడ్జ్బాస్టన్ స్టేడియంలోకి అనుమతిస్తారు. స్టేడియంలో వారు ఎక్కడైనా కూర్చోవచ్చు. 16 ఏళ్ల లోపు పిల్లలకూ అనుమతి ఉంది.
'వెస్ట్ మిడ్ల్యాండ్స్ క్రీడల్లో ఇదో గొప్ప ముందడుగు. ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య మరో బ్లాక్ బస్టర్ను ఎంతో మంది అభిమానులు ఆస్వాదించొచ్చు' అని వార్విక్షైర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ కెయిన్ తెలిపారు. అయితే రెండు వారాల క్రితమే ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టుకు 70% మంది అభిమానులను అనుమతించారు. ఇప్పుడు అదనంగా మరో 10 శాతం మందికి అనుమతిని ఇచ్చారు.
'భారీ స్థాయి క్రీడల నిర్వహణకు కొత్త మోడల్ను అభివృద్ధి చేసేందుకు ఈ మధ్యే జరిగిన టెస్టు మ్యాచ్ మాకో గొప్ప అవకాశం కల్పించింది. ఇదే విధానాన్ని ఇప్పుడు పాకిస్థాన్ మ్యాచ్లో కొనసాగిస్తుండటం సంతోషకరం. ఎడ్జ్బాస్టన్ క్రీడా ప్రతిష్ఠకు భంగం కలగకుండా సురక్షిత వాతావరణం కల్పించేందుకు మేం సాంకేతికతను వినియోగించుకుంటాం' అని స్టువర్ట్ కెయిన్ మంగళవారం తెలిపారు.
ఈ మ్యాచ్కు హాజరయ్యే క్రికెట్ అభిమానులకు కొన్ని నిబంధనలు విధించారు. 11 ఏళ్లు పైబడిన వారు కొవిడ్ నెగెటివ్ నివేదిక చూపించాల్సి ఉంటుంది. లేదా రెండు వ్యాక్సిన్లు తీసుకొని 14 రోజులైనట్టు రిపోర్టు చూపించాలి. పై రెండింటిలో ఏది ఉన్నా.. అభిమానులకు మైదానంలోకి ఎంట్రీ ఉంటుంది. త్వరలో జరిగే ఇంగ్లండ్, భారత్ సిరీసుకు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని సమాచారం తెలుస్తోంది. ఐదు టెస్టుల్లో భాగంగా ఆగష్టు 4న ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది.