
మాంచెస్టర్: ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్లో ఇరు జట్లకు టాపార్డర్ బ్యాట్స్మన్ ప్రదర్శనే కీలకం కానుందని పాక్ చీఫ్ సెలెక్టర్, కోచ్ మిస్బా ఉల్ హక్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్లో 300+ స్కోర్ చేయగలిగితే 75శాతం విజయం సాధించే అవకాశం ఉంటుందన్నాడు. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ఈ సిరీస్ జరుగనుంది.
తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న మిస్బా ఉల్ హక్ మాట్లాడుతూ... 'ఇటీవల ఇంగ్లండ్ బ్యాట్స్మన్ కూడా (వెస్టిండీస్తో తొలి టెస్టులో) తడబడ్డారు. ఇప్పుడు ఇంగ్లండ్, పాక్ జట్ల టాపార్డర్ బ్యాట్స్మెన్ ఎలా ఆడతాన్నదే కీలకంగా మారనుంది. తొలి ఇన్నింగ్స్లో 300పైగా పరుగులు చేస్తే.. గెలిచేందుకు 75శాతం అవకాశముంటుంది. మా జట్టు సన్నద్ధతపై సంతృప్తిగా ఉన్నాం. మూడు నెలల తర్వాత జట్టు ఆటగాళ్లంత ఒక్కచోట చేరారు. మా బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్, అజర్ అలీ, అషద్ షఫీక్పై చాలా అంచనాలు ఉన్నాయి. వారి ప్రదర్శన చాలా ముఖ్యం' అని అన్నాడు.
ఆగస్టు 5 నుంచి ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. సిరీస్ మొత్తం మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికగానే జరగనున్నాయి. మొదటి టెస్టు మాంచెస్టర్లో జరుగుతుంది. రెండో టెస్టు (ఆగస్టు 13-17), మూడో టెస్టు (ఆగస్టు 21-25)కు సౌతాంప్టన్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత రెండు జట్లు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి. తొలి మ్యాచ్ ఆగస్టు 28న జరుగుతుంది. టీ20లు అన్నీ సౌతాంప్టన్లో జరుగుతాయి.
ఇంగ్లండ్ ఒక్క రోజు వ్యవధిలోనే వరుసగా వన్డే, టెస్టు ఆడనుండడం ఆసక్తికరంగా మారింది. మంగళవారం సౌతాంప్టన్ వేదికగా చివరి వన్డేలో ఐర్లాండ్తో తలపడే ఇంగ్లీష్ జట్టు.. బుధవారం మాంచెస్టర్లో పాకిస్థాన్తో ఆరంభమయ్యే తొలి టెస్టులో బరిలో దిగనుంది. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా?.. ఆ రెండు మ్యాచ్ల్లో తలపడే ఇంగ్లీష్ జట్లలో వేర్వేరు ఆటగాళ్లు ఉన్నారు. ఐర్లాండ్తో వన్డేకు ఇయాన్ మోర్గాన్, జానీ బెయిర్స్టో, సామ్ బిల్లింగ్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, జో విన్స్ లాంటి ఆటగాళ్లు బరిలో దిగుతుండగా.. పాక్తో టెస్టులో జో రూట్, జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్ వోక్స్, మార్క్వుడ్ తదితరులు ఆడనున్నారు.