
సౌతాంప్టన్: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న తరుణంలోనూ ప్రత్యేక ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్న ఇంగ్లండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ను వరుణుడు అస్సలు వదలడం లేదు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓ రోజు ఆటను మింగేసిన వర్షం.. రెండో టెస్టును ముందుకు సాగనివ్వడం లేదు. తొలి రోజు సగం ఆట వరుణుడి కారణంగా నిలిచిపోగా.. రెండో రోజు కూడా అదే కథ కొనసాగింది. మూడో రోజు అయితే ఒక్కబంతి కూడా పడలేదు. ఇక నాలుగో రోజు కేవలం 10.2 ఓవర్లు మాత్రమే పడ్డాయి.
ఓవర్నైట్ స్కోరు 223/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్.. 236 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ రిజ్వాన్ (72; 7 ఫోర్లు) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి చివరి వికెట్గా వెనుదిరిగాడు. నసీం షా (1) నాటౌట్గా ఉన్నాడు. ఓపెనర్ అబిద్ అలీ (60), స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజామ్ (47) పరుగులతో రాణించారు. కెప్టెన్ అజర్ అలీ (20) ఈ టెస్టు సిరీస్లో చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ (4/56), అండర్సన్ (3/60) రాణించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లండ్ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. డోమ్ సిబ్లే (2), జాక్ క్రాలే (5) క్రీజులో ఉన్నారు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 229 రన్స్ వెనుకబడింది. 5 ఓవర్ల తర్వాత (నాలుగో రోజు) భారీ వర్షం కారణంగా తిరిగి ఆటగాళ్లు మైదానంలోకి రాలేదు. నాలుగో రోజు కేవలం 10.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవడంతో రెండో టెస్టు 'డ్రా'గా ముగియడం ఖాయమైంది. సోమవారం మ్యాచ్కు చివరి రోజు.
తొలి ఓవర్లో పాక్ బౌలర్ షాషీన్ అఫ్రిదీ ఇంగ్లండ్కు భారీ షాకిచ్చాడు. నాలుగో బంతికి స్టార్ ఓపెనర్ రోరీ బర్న్స్ను ఔట్ చేసిన అఫ్రిదీ పాక్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్తో బర్న్స్ను బోల్తా కొట్టించాడు. నాలుగు బంతులాడిన బర్న్స్.. డకౌట్ కావడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. అఫ్రిదీ మంచి ఫామ్లో ఉండగా వర్షం కురిసింది. లేదంటే ఇంగ్లండ్కు కష్టాలు తప్పకపోవచ్చేమో. తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.