సౌతాంప్టన్: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న తరుణంలోనూ ప్రత్యేక ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్న ఇంగ్లండ్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ను వరుణుడు వదలడం లేదు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓ రోజు ఆటను మింగేసిన వర్షం.. రెండో టెస్టులో కనీసం రెండు ఇన్నింగ్స్ల ఆట కూడా సాగలేదు. తొలి రోజు సగం ఆట వరుణుడి కారణంగా నిలిచిపోగా.. రెండో రోజు కూడా అదే కథ కొనసాగింది. మూడో రోజు అయితే ఒక్కబంతి కూడా పడలేదు. ఇక నాలుగో రోజు కేవలం 10.2 ఓవర్లు మాత్రమే పడ్డాయి. మ్యాచ్ చివరి రోజు, సోమవారం కూడా వర్షం వెంటాడింది. వర్షం వెంటాడిన రెండో టెస్టు పేలవమైన డ్రాగా ముగిసింది.
సోమవారం ఉదయం వర్షం, ఆ తర్వాత పిచ్ చిత్తడిగా మారడంతో తొలి రెండు సెషన్ల ఆట వీలు కాలేదు. చివరికి మైదానాన్ని సిద్ధం చేయడంతో.. టీ బ్రేక్ తర్వాత ఇరు జట్లు బరిలోకి దిగాయి. అయితే 36 ఓవర్ల ఆట తర్వాత ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. ఓవర్నైట్ స్కోరు 7/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 110/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఈ స్థితిలో రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (53) టాప్ స్కోరర్గా నిలిచాడు. సిబ్లేతో కలిసి క్రాలే రెండో వికెట్కు 91 పరుగులు జత చేశాడు. అయితే వీళ్లిద్దరూ రెండు ఓవర్ల తేడాతో ఔట్ కావడంతో ఇంగ్లండ్ 92/3తో నిలిచింది. ఈ రెండు వికెట్లను పేసర్ మహ్మద్ అబ్బాస్ (2/28) ఖాతాలో వేసుకున్నాడు. పోప్ (9) కూడా త్వరగానే ఔటయ్యాడు. కెప్టెన్ రూట్ (9).. బట్లర్ (0)తో కలిసి నాటౌట్గా నిలిచాడు. వర్షం కారణంగా రెండు జట్లు కూడా రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశం లేకుండా పోయింది. మొహమ్మద్ రిజ్వాన్ (72) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
అంతకుముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రిజ్వాన్ (72) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ (4/56), అండర్సన్ (3/60) రాణించారు. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టును గెలుచుకున్న ఇంగ్లీష్ జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరిదైన మూడో టెస్టు శుక్రవారం నుండి సౌథాంప్టన్లోనే ఆరంభం కానుంది.
IPL 2020: టైటిల్ స్పాన్సర్ రేసు నుండి పతంజలి ఔట్?