హైదరాబాద్: ప్రస్తుతం ఇంగ్లాండ్లో వేడిగాలులు వీస్తోన్న నేపథ్యంలో స్పిన్నర్లకు పరిస్థితులు అనుకూలిస్తాయని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అంటున్నాడు. సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్లో వేడిగాలులు వీస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్లో వీస్తున్న వేడిగాలులు భారత్కు మేలు చేస్తాయని జహీర్ ఖాన్ వెల్లడించాడు. వేడి వాతావరణం వల్ల పేసర్లకు ఇబ్బంది కలిగినా, స్పిన్నర్లకు పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పాడు.
అంతేకాదు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అంశాన్ని టీమిండియా పరిశీలించాలని సూచించాడు. ఆగస్టు 1 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ మాట్లాడుతూ ''ఈ వాతావరణంతో పేసర్లకైతే కష్టం. అయితే భారత్కు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జట్టు యాజమాన్యం కూడా దీన్ని పరిశీలించే అవకాశం ఉంది'' అని అన్నాడు.
ఈ టెస్టు సిరిస్లో కుల్దీప్ యాదవ్పై అంచనాల ఒత్తిడి ఉందని, అందుకు అనుగుణంగా రాణించాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉందని జహీర్ అన్నాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ భారత్ సవాలేనని జహీర్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ సవాల్ను భారత్ అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
''ఈసారి భారత్ గెలుస్తుందని అందరూ చెబుతున్నారు. నేనూ అదే అనుకుంటున్నా. అయితే ఇది ఐదు టెస్టుల సిరీస్. ఈ పర్యటనలో భారత్ నిలకడగా ఆడాల్సి ఉంటుంంది. దక్షిణాఫ్రికాతో సిరీస్లో భారత్ ప్రదర్శన చూసిన తర్వాత నాకు ఆశ కలుగుతోంది. ఆ సిరీస్ 1-2తో ఓడినా ఆఖరి టెస్టులో పోరాడిన తీరు నన్ను ఆకట్టుకుంది'' అని జహీర్ ఖాన్ అన్నాడు.