
లండన్: క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడాదికి పైగా మైదానాల వైపు సరిగ్గా చూడని ఫాన్స్.. ఇకపై తమ అభిమాన క్రికెటర్ను స్వయంగా చూడనున్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ పూర్తిస్థాయి ప్రేక్షకుల మధ్య జరిగే అవకాశం ఉంది. ఆగష్టు 4న ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఇక కరోనా కారణంగా ఇటీవల ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ప్రేక్షకులను పరిమిత సంఖ్యలోనే అనుమతించిన విషయం తెలిసిందే. ఫైనల్కు పరిమిత సంఖ్యలో 4000 మంది ప్రేక్షకులను అనుమతించారు.
సోమవారం నుంచి కొవిడ్-19కు సంబంధించిన నిబంధనల్ని ఎత్తివేస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ప్రజలు కూడా మాస్క్లు తప్పనిసరి ధరించాల్సిన అవసరం లేదని కూడా ప్రధాని తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం కోవిడ్ నిబంధనల్ని సడలించడంతో.. క్రికెట్ స్టేడియం హౌస్ఫుల్ అయ్యేందుకు మార్గం సుగమమైంది. జులై 19 నుంచి మైదానాల్లోకి అభిమానులను అనుమతించనున్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్కు మైదానం నిండా ప్రేక్షకుల్ని అనుమతించాలని ఇంగ్లండ్ అండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడిపోయాక.. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమిండియాకు మధ్యలో ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు కోహ్లీసేన బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు క్రికెటర్లకు విరామం ఇచ్చింది బీసీసీఐ. దీంతో లండన్ పరిసర ప్రాంతాల్లో కుటుంబాలతో కలిసి విహరిస్తున్నారు. దొరికిందే సందని లండన్లోని పర్యటక ప్రదేశాలకు, వింబుల్డన్ మ్యాచ్లు చూస్తూ భారత ఆటగాళ్లు సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.
ప్రస్తుతం విహార యాత్రలకు వెళ్లిన కోహ్లీసేన జులై 15న దుర్హమ్లోని ఎమిరేట్స్ రివర్సైడ్లో రిపోర్టు చేయనున్నారు. ఆగస్టు 1 వరకు వారు అక్కడ సన్నద్ధమవుతారు. అనంతరం నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ మైదానానికి చేరుకొని ఆగస్టు 4న తొలి టెస్టు ఆడతారు. ఐదు టెస్టుల సిరీస్కు ముందు 'కౌంటీ సెలెక్ట్ XI' జట్టుతో భారత్ ఒక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అందుకోసం ఈసీబీ సన్నాహకాలు చేస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.