
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సహా మరొక క్రికెటర్ కరోనా బారిన పడ్డాడని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పంత్ కరోనా బారిన పడినట్టు బీసీసీఐ కూడా స్పష్టం చేసింది. తాజాగా ఓ స్టాఫ్ మెంబర్కు కూడా పాజిటివ్గా తేలినట్లు సమాచారం తెలుస్తోంది. స్టాఫ్ మెంబర్తో పాటు మరో ముగ్గురు కోచింగ్ సిబ్బంది కూడా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. త్రోడౌన్ సిబ్బంది దయానంద్ గరణికి కరోనా సోకిందని సమాచారం. వీరెవరూ టీమిండియాతో కలిసి డర్హమ్ వెళ్లడం లేదట.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని 23 మంది ఆటగాళ్ల బృందం గత నెల యూకేకు వెళ్లిన సంగతి తెలిసిందే. న్యూజీలాండ్తో ఫైనల్ ముగిసాక.. బీసీసీఐ ఆటగాళ్లకు 20 రోజుల విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి యూకే చుట్టుపక్కల ప్రాంతాల్లో నచ్చిన చోటుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్.. యూరో కప్ 2020 మ్యాచ్లు వీక్షించేందుకు వెళ్లాడు. అక్కడ మాస్క్ లేకుండానే ప్రేక్షకుల మధ్య కూర్చొని ఫొటోలు దిగాడు. దాంతో అక్కడే అతడికి వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు.
అయితే ఇప్పటికే రిషబ్ పంత్కు నెగిటివ్ వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. పంత్తో సన్నిహితంగా ఉన్న మరో క్రికెటర్ మాత్రం తన బంధువుల ఇంట్లో హోం ఐసోలేషన్లో ఉన్నాడట. ఇతనికి వచ్చే ఆదివారం పరీక్షలు జరుపుతారని సమాచారం. కరోనా బారినపడ్డ ఇద్దరు ప్లేయర్లలో పెద్దగా లక్షణాలు లేవట. కొద్దిగా జలుబు, దగ్గుతో బాధపడ్డారట. అయితే కరోనా బారినపడ్డ ఆ రెండో క్రికెటర్ ఎవరన్నది మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. తాజాగా భారత జట్టు స్టాఫ్ మెంబర్కి (దయానంద్ గరణి) కరోనా సోకింది. అతనితో సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు కోచింగ్ సిబ్బంది ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారట. సిబ్బంది దయానంద్ గరణితో సన్నిహితంగా ఉన్న టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ఐసోలేషన్లోకి వెళ్ళిపోయాడట.