
లండన్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో కరోనా వాక్సిన్ తొలి డోస్ వేసుకున్న భారత క్రికెటర్లు.. తాజాగా ఇంగ్లండ్లో రెండో డోస్ వేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులకూ టీకా ఇచ్చారని సమాచారం. ఇటీవలి కాలంలో ఇంగ్లండ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేశారట. శనివారం నుంచి ఆటగాళ్లకు టెస్టులు చేయడం మొదలుపెట్టారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోసం కోహ్లీసేన ఇంగ్లండ్కు వచ్చింది. ఇంగ్లండ్ బయల్దేరే ముందే క్రికెటర్లకు భారత్లో కరోనా వ్యాక్సిన్ (కొవిషీల్డ్) వేయించారు. రెండో డోసును బ్రిటన్లో వేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసాక క్రికెటర్లకు బీసీసీఐ మూడు వారాల విరామం ఇచ్చింది. విరామం ముగియడంతో తాజాగా రెండో డోసు టీకా వేశారు.
ప్రస్తుతం ఆటగాళ్లంతా దుర్హమ్ చేరుకున్నారు. అక్కడే శిక్షణ శిబిరంలో ఉండనున్నారు. వైరస్ పరీక్షల అనంతరం రెండు బృందాలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నారు. ఆపై ఇంగ్లీష్ కౌంటీ ఎలెవన్తోనూ ఓ మ్యాచ్ ఉంటుంది. దుర్హమ్లో క్రికెటర్లు బయో బుడగలో ఉండరని తెలుస్తోంది. భౌతిక దూరం, ఇతరులను కలవకుండా కఠిన సూచనలతో కూడిన బయో రక్షణ వాతావరణంలో ఉంచుతారని సమాచారం. ఆగష్టు 4 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్ దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. బయో బుడగలా ఉన్నా.. క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. జాతీయ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయ సిబ్బందికి వైరస్ రావడంతో జట్టంతా ఐసోలేషన్లో ఉంది. దాంతో పాకిస్తాన్ సిరీసు కోసం బెన్ స్టోక్స్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించారు. మరోవైపు కౌంటీ క్రికెట్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలు జట్లలో పాజిటివ్ కేసులు రావడంతో మ్యాచులు రద్దు చేసి ఐసోలేషన్కు పంపించారు.