
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేనకు శుభవార్త. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో బరిలో దిగిన భారత్.. సౌతాంఫ్టన్ పరిస్థితుల్లో ఆడలేక చేతులెత్తేసింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్లతో పాటు చాలా మంది మాజీలు ప్రాక్టీస్ మ్యాచ్ ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. దీంతో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభానికి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ను కోరింది.
ప్రాక్టీస్ మ్యాచ్ ఉండాలన్న బీసీసీఐ అభ్యర్థనను ఈసీబీ అంగీకరించింది. జులై 20-22 మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను ఈసీబీ షెడ్యూల్ చేసిందని సమాచారం. అయితే ప్రస్తుతానికి భారత జట్టుతో తలపడే ప్రత్యర్థి టీమ్ ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే ఆ వివరాలు తెలియరానున్నాయి. ప్రస్తుతం బయో బబుల్ నుంచి బయటకు వచ్చి.. కుటుంబంతో గడుపుతున్న కోహ్లీసేన తిరిగి రాగానే ఈ మ్యాచ్ జరగనుంది. ఆగష్టు 4న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
న్యూజిలాండ్తో జరిగిన ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఓడిపోయాక.. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీసుకు మధ్యలో ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు భారత క్రికెటర్లకు విరామం ఇచ్చింది బీసీసీఐ. దీంతో వారు నచ్చిన ప్రాంతాల్లో విహరిస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలను ప్లేయర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటున్నారు.