
లండన్: న్యూజిలాండ్తో జరిగిన ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఓడిపోయాక.. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమిండియాకు మధ్యలో ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు కోహ్లీసేన బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు క్రికెటర్లకు విరామం ఇచ్చింది బీసీసీఐ. దీంతో లండన్ పరిసర ప్రాంతాల్లో కుటుంబాలతో కలిసి విహరిస్తున్నారు.
దొరికిందే సందని లండన్లోని పర్యటక ప్రదేశాలకు, వింబుల్డన్ మ్యాచ్లు చూస్తూ భారత ఆటగాళ్లు సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ కాఫీ షాపుకు వెళ్లి సరదాగా గడిపాడు. తాజాగా బ్యాట్ బ్యాలెన్స్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. కోహ్లీ, అనుష్క ఇద్దరూ తమ వేలిపై బ్యాట్ ఉంచుకుని చక్కగా బ్యాలెన్స్ చేసారు. ముఖ్యంగా అనుష్క. అందుకు సంబంధించిన ఓ వీడియోను అనుష్క తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇది నెట్టింట వైరల్ అయింది.
కొన్నాళ్ల క్రితం ఓ వీడియో షేరింగ్ యాప్తో విరాట్ కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సదరు యాప్లో వీడియోలు చేస్తూ అభిమానులకు ఛాలెంజ్ విసురుతున్నాడు. తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి బ్యాట్ బ్యాలెన్స్ ఛాలెంజ్లో పాల్గొన్నాడు. అనుష్క, కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు.
ప్రస్తుతం విహార యాత్రలకు వెళ్లిన కోహ్లీసేన జులై 15న దుర్హమ్లోని ఎమిరేట్స్ రివర్సైడ్లో రిపోర్టు చేయనున్నారు. ఆగస్టు 1 వరకు వారు అక్కడ సన్నద్ధమవుతారు. అనంతరం నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ మైదానానికి చేరుకొని ఆగస్టు 4న తొలి టెస్టు ఆడతారు. ఐదు టెస్టుల సిరీస్కు ముందు 'కౌంటీ సెలెక్ట్ XI' జట్టుతో భారత్ ఒక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అందుకోసం ఈసీబీ సన్నాహకాలు చేస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.