
హైదరాబాద్: లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి నెమ్మదిగా మద్దతు పెరుగుతోంది. రెండో ఓటమికి ధోనిని బాధ్యుడుని చేస్తూ క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు తీవ్రవ విమర్శలు చేసిన సంగి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మూడో వన్డేకి ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ "ధోని ఫామ్ గురించి, అతని సామర్థ్యం గురించి ప్రశ్నించడం దురదృష్టకరం. ధోని తన సహజశైలికి భిన్నంగా ఆడినప్పుడు మళ్లీ మళ్లీ ఇలాగే జరుగుతుంటుంది. అతడు ఫెయిలైనప్పుడు మాత్రమే ఇలా విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది సమయంలోనే జనాలు తమ అభిప్రాయాలను మార్చుకోవడం దురదృష్టకరం" అని అన్న సంగతి తెలిసిందే.
తాజాగా టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ సైతం ధోనీకి అండగా నిలిచాడు. రెండో వన్డేలో జట్టు కూర్పు భిన్నంగా ఉండటంతో ధోని అలా ఆడాల్సి వచ్చిందని సంజయ్ బంగర్ తెలిపాడు. "మా జట్టు కూర్పు ప్రకారం 8, 9, 10 స్థానంలో బ్యాటింగ్ చేసే వారు లేరు. అలాంటప్పుడు వెంటవెంటనే వికెట్లు పడుతున్న తరుణంలో బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా ఆడటం కష్టం" అని అన్నాడు.
"డెత్లో ఇంగ్లాండ్ బౌలర్లు సైతం అద్భుతంగా బంతులు విసిరారు. పరుగులు చేయకుండా కట్టడి చేశారు. బౌండరీలు లభించకపోవడంతో రన్రేట్ అమాంతం పెరిగిపోయింది. ధోని తనతో పాటు బ్యాటింగ్ చేసే మరో సహచర ఆటగాడి కోసం చూశాడు. 40వ ఓవర్ తర్వాత బౌలింగ్ను చితకబాదాలని వ్యూహం రచించాడు" అని బంగర్ చెప్పుకొచ్చాడు.
"ధోని దూకుడుగా ఆడే క్రమంలో ప్రతిసారీ వికెట్లు పోయాయి. ముందు రైనా, తర్వాత పాండ్యా పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత ఆడేవారు లేకపోవడంతో తనదైన శైలిలో ధోని విజృంభణ చేయలేకపోయాడు" అని సంజయ్ బంగర్ వివరణ ఇచ్చాడు. రెండో వన్డేలో ధోని 59 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి.
తన సహజశైలికి భిన్నంగా డెత్ ఓవర్లలో నిదానంగా ఆడిన ధోనిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.