హైదరాబాద్: ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు ఎంతో శ్రమించాడని ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగింది.
ఈ టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో కోహ్లీసనపై విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు లార్డ్స్ వేదికగా గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ మీడియాతో మాట్లాడాడు.
"తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీని సాధించాడు. అయితే, ఇక్కడ మా బౌలర్ల తీరుని ప్రశంసించాలి. విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు ఎంతో కష్టపడ్డాడు. మేం కొన్ని అవకాశాలు సృష్టించాం. దురదృష్టవశాత్తు వాటిని అందిపుచ్చుకోలేకపోయాం. ఆ విభాగంలోనే మేం మెరుగవ్వాలి" అని అన్నాడు.
"తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో మా బ్యాట్స్మెన్లు జో రూట్, బెయిర్స్టో ఫామ్లో ఉండగా 216/3 పరుగులతో ఉన్నాం. అయితే, ఆ తర్వాత దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. వెంటవెంటనే వికెట్లను కోల్పోయాం. భారత్ 100/5తో ఉన్నప్పుడు త్వరగా ఔట్ చేయలేకపోయాం. దీంతో భారత్ మా స్కోరుకు దగ్గరగా వచ్చింది" అని బట్లర్ పేర్కొన్నాడు.
కాగా, భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా గురువారం ప్రారంభం కావాల్సిన రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం పడుతుండడంతో టాస్ ఆలస్యం కానుంది. పిచ్ మొత్తాన్ని కవర్లతో మూసి ఉంచారు. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూముకు పరిమితమయ్యారు.
వర్షం తగ్గముఖం పట్టిన తర్వాత అంఫైర్లు టాస్ వేయనున్నారు. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో జరిగిన తొలి టెస్టును ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. దీంతో లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్ను సమం చేయాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు.
ఇప్పటివరకు ఈ మైదానంలో టీమిండియా 17 టెస్టులాడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. నాలుగు టెస్టులు డ్రాగా ముగియగా, 11 మ్యాచుల్లో ఓడింది. లార్డ్స్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. ఇక్కడ 729/6 పరుగులు చేసింది. ఇక అత్యల్ప స్కోరు భారత్దే. 17 ఓవర్లు ఆడి 42 పరుగులు చేసి ఆలౌట్ అయింది.