
లండన్: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య యాషెస్ రెండో టెస్టు తొలి రోజు ఆట ఎడతెరిపిలేని వర్షం కారణంగా పూర్తిగా రద్దయ్యింది. బుధవారం ఒక్క బంతి కూడా పడకుండానే తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది. వరణుడు టాసే వేసే సమయం కూడా ఇవ్వలేదు. తొలుత నిర్ణీత సమయం కంటే కొంత ఆలస్యంగా మ్యాచ్ మొదలవుతందనుకున్నా.. ఆ తర్వాత వర్షం నిరంతరాయంగా కురిసింది.
లంచ్ విరామ సమయానికి ముందు పిచ్ పరిశీలించిన అంపైర్లు అలీమ్ దార్, క్రిస్ గఫానే 3 గంటలకు టాస్ వేద్దామని ఇరు జట్లు కెప్టెన్లకు సమాచారం అందించారు. ఇదే సమయంలో మరోసారి వరణుడు అడ్డుకోవడంతో మ్యాచ్ సాగేందుకు వీలు కాలేదు. మరోసారి పిచ్ పరిశీలించిన అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గత రెండు నెలలుగా ఇంగ్లాండ్లో వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్లోని కొన్ని మ్యాచ్లకు వర్షం ఆటకం కలిగించిన విషయం తెలిసిందే.
మ్యాచ్ రద్దవడంతో వరల్డ్కప్ హీరో, ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున టెస్ట్ల్లో అరంగేట్రానికి మరో రోజు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్చర్కు ససెక్స్ టీమ్మేట్ క్రిస్ జోర్డాన్ ఇంగ్లండ్ క్యాప్ని అందించాడు. తొలి టెస్టు ఆసీస్ 251 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ రెండు సెంచరీలు చేసాడు. ఇంగ్లాండ్లో ఆసీస్ యాషెస్ సిరీస్ గెలిచి 18 సంవత్సరాలైంది.