పోటీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ సత్తాచాటింది. అయిదు వన్డేల సిరీస్లో భాగంగా రివర్సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియాపై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో ఆసీస్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగులు చేసింది. అలెక్స్ కేరి (77 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), స్టీవ్ స్మిత్ (60; 82 బంతుల్లో, 5 ఫోర్లు), హార్డీ (44; 26 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. జోఫ్రా ఆర్చర్ రెండు, బెథెల్, విల్ జాక్స్, లివింగ్స్టోన్, బ్రైడన్ తలో వికెట్ తీశారు.

అనంతరం భారీ ఛేదనకు దిగిన ఇంగ్లండ్ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 37.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. అయితే ఈ దశలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. అంతేగాక వరుణుడు దోబూచులాడాడు. మ్యాచ్ కొనసాగడం కష్టమని భావించిన అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. ఆ సమయానికి 46 పరుగుల ముందంజలో ఉన్న ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించారు.
హ్యారీ బ్రూక్ (110 నాటౌట్, 94 బంతుల్లో, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ శతకంతో చెలరేగాడు. విల్ జాక్స్ (84; 82 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) కూడా చెలరేగాడు. లివింగ్స్టోన్ (33 నాటౌట్; 20 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అయితే ఈ ఓటమితో ఆస్ట్రేలియా వరుస 14 విజయాలకు బ్రేక్ పడింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా చేతిలో లీగ్ మ్యాచ్లో ఓటమి అనంతరం వరుస విజయాలతో ఆస్ట్రేలియా హొరెత్తించింది. కప్ను గెలిచిన ఆసీస్ అక్టోబర్-2023 నుంచి సెప్టెంబర్-2024 వరకు జైత్రయాత్ర కొనసాగించింది. వన్డేల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో శ్రీలంక (13)ను దాటి రెండో స్థానంలోనూ ఆస్ట్రేలియానే నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డుకు బ్రేక్ పడింది. 2003లో ఆసీస్ వరుసగా 21 వన్డేలు గెలిచింది.