
హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ తన జోరుని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరిస్లో రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు.
163 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేశాడు. ఈ సిరిస్లో స్టీవ్ స్మిత్కు ఇది మూడో సెంచరీ కాగా, మొత్తంగా చూస్తే టెస్టు క్రికెట్లో 26వ సెంచరీ కాడవం విశేషం. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (25 టెస్టు సెంచరీలు) రికార్డుని స్టీవ్ స్మిత్ అధిగమించాడు.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ విసిరిన బౌన్సర్కు గాయడిన స్టీవ్ స్మిత్ మూడో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగో టెస్టు రెండో రోజు లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 69 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది.
ప్రస్తుతం స్టీవ్ స్మిత్(101), కెప్టెన్ టిమ్ పైన్(9) క్రీజులో ఉన్నారు. తొలి సెషన్లో మ్యాథ్యూ వేడ్(16), ట్రావిస్ హెడ్(19) వికెట్లను కోల్పోయిన ఆస్ట్రేలియా 75 పరుగులు చేసింది. ఈ సిరిస్లో ఇప్పటికే స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇందులో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది.