
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో భాగంగా లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభం కావాల్సిన రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో టాస్ వర్షం కారణంగా వాయిదా పడింది. లంచ్ విరామ సమయానికి కూడా వర్షం భారీగా కురుస్తుండటంతో అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు, అంఫైర్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. మరికొన్ని గంటల్లో వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని... అయితే, రోజంతా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో తొలిరోజు మ్యాచ్ జరగడం అనుమానంగానే ఉంది.
ప్రపంచకప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్ను దాని సొంతగడ్డపై తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓడించడంతో ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ రెండు సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తొలి టెస్టు తొలి మూడు రోజుల్లో ఇంగ్లాండే ఆధిపత్యం చలాయించినప్పటికీ.. స్మిత్ అద్భుతంగా పోరాడి రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించడంతో 251 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో లార్డ్స్ టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.