
హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా ఆప్ఘనిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్ స్టో తృటిలో సెంచరీ కోల్పోయాడు. 99 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో... గుల్బదిన్ నైబ్ వేసిన 30వ ఓవర్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో బెయిర్ స్టో నిరాశగా పెవిలియన్కు చేరాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
సెంచరీ ముంగిట బెయిర్ స్టో ఔట్ కావడంతో ఇంగ్లాండ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు జేమ్స్ విన్సే-బెయిర్ స్టోలు ఆరంభించారు. అయితే, జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా విన్సే(26) తొలి వికెట్గా ఔటయ్యాడు.
ఆ తర్వాత జో రూట్తో కలిసి బెయిర్ స్టో ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెయిర్ స్టో ఔటయ్యాడు. ఆ తర్వాత జో రూట్ 54 బంతుల్లో 2 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గత ఆరు ఇన్నింగ్స్లో జో రూట్కు ఇది ఐదో హాఫ్ సెంచరీ.
కాగా, వన్డేల్లో 32వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. బెయిర్ స్టో ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇయాన్ మోర్గాన్ కూడా దూకుడుగా ఇన్నింగ్స్ని ఆరంభించాడు. నైబ్ బౌలింగ్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది తన ఉద్దేశమేంటో చెప్పేశాడు. ఈ మ్యాచ్లో పసికూన ఆప్ఘన్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది.
ఈ క్రమంలో కెప్టెన్ మోర్గాన్ ఆప్ఘన్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు. 57 బంతుల్లో 3 ఫోర్లు, 11 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 43వ ఓవర్లో మూడు సిక్సర్లు బాది సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ మూడొందల మార్కుని అందుకుంది.
ప్రస్తుతం 44 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 302 పరుగులుచేసింది. క్రీజులో జో రూట్(74), ఇయాన్ మోర్గాన్(104) పరుగులతో ఉన్నారు.