21 ఏళ్ల జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. తన ఆఖరి మ్యాచ్లోనూ ఇంగ్లండ్ విజయంలో అండర్సన్ కీలక పాత్ర పోషించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో మూడు వికెట్లతో చెలరేగి వెస్టిండీస్ ఘోర పరాజయానికి ప్రధాన కారకుడు అయ్యాడు. లార్డ్స్ వేదికగా జరగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్పై ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
79/6 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన వెస్టిండీస్ 136 పరుగులకే ఆలౌటైంది. తన కెరీర్లో ఆఖరిసారి బంతి అందుకున్న అండర్సన్ ఇవాళ వెస్టిండీస్ను తొలి దెబ్బ కొట్టాడు. జోషువా డసిల్వాను బోల్తాకొట్టించాడు. అండర్సన్ వేసిన బంతిని షాట్కు యత్నించి డసిల్వా వికెట్ కీపర్ జేమీ స్మిత్ చేతికి చిక్కాడు.

అనంతరం వెస్టిండీస్ పతనానికి ఎక్కువ సమయం పట్టలేదు. తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లతో చెలరేగిన అరంగేట్రం బౌలర్ రెండో ఇన్నింగ్స్లోనూ చెలరేగాడు. అయిదు వికెట్లతో సత్తాచాటాడు. మూడో రోజు ఆటలో అల్జారీ జోషెప్ (8), షామర్ జోసెఫ్ (3), సీల్స్ (8)లను ఔట్ చేశాడు. అయితే ఆఖరి వికెట్ అండర్సన్కే దక్కేది. మొటీ (31 నాటౌట్) ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను అండర్సన్ అందుకోలేకపోయాడు. తేలికైన క్యాచ్ను జారవిడిచాడు. వెంటనే ప్రేక్షకులు క్లాప్స్తో అండర్సన్ను ఉత్సాహపరిచారు.

కాగా, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 41.4 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. లూయిస్ (27) టాప్ స్కోరర్. గస్ అట్కిన్సన్ ఏడు వికెట్లతో సత్తాచాటాడు. అండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 371 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (76), జేమీ స్మిత్ (70), జో రూట్ (68), ఒలీ పోప్ (57), హ్యారీ బ్రూక్ (50) అర్ధశతకాలు సాధించారు. విండీస్ బౌలర్లలో సీల్స్ నాలుగు వికెట్లు, హోల్డర్, మొటియ్ చెరో రెండు వికెట్లు తీశారు.