హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లడ్ 3-1తో కైవసం చేసుకుంది. మొయిన్ అలీ మాయ చేయడంతో చివరిదైన నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-1తో చేజిక్కించుకుంది.
కుక్ నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన జో రూట్ తన తొలి టెస్టు సిరిస్లోనే ఇంగ్లండ్కు విజయాన్ని అందించాడు. అంతేకాదు 1998 తర్వాత దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. నాలుగో రోజు 380 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా, అలీ (5/69) స్పిన్ని తట్టుకోలేకపోయింది.
62.5 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటైంది. హషీమ్ ఆమ్లా (83), కెప్టెన్ డు ప్లెసిస్ (61) అర్ధ శతకాలతో ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఆమ్లా, డికాక్ (1), డి బ్రుయాన్ (0)లను వెంట వెంటనే అవుట్ చేసిన అలీ సఫారీలను కోలుకోలేని దెబ్బకొట్టాడు.

మరో బౌలర్ అండర్సన్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 224/8తో సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్.. మరో 19 పరుగులు మాత్రమే జోడించి 243 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 362, దక్షిణాఫ్రికా 226 పరుగులు చేశాయి. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు అలీకి దక్కాయి.
తొలి ఇన్నింగ్స్:
ఇంగ్లాండ్ 362;
దక్షిణాఫ్రికా: 226;
రెండో ఇన్నింగ్స్:
ఇంగ్లాండ్ 243;
దక్షిణాఫ్రికా: 202 (ఆమ్లా 83, డుప్లెసిస్ 61, మహారాజ్ 21; అలీ 5/69, అండర్సన్ 3/16)