హైదరాబాద్: తొలి ఓటమితో గుణపాఠం నేర్చుకుని రెండో మ్యాచ్లో గెలవాలని తీవ్రమైన పట్టుదలతో శ్రమిస్తోంది ఇంగ్లాండ్. ఈ క్రమంలో ఇంగ్లీష్ జట్టు ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా.. టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని ఎదుర్కోవడంపై ఆ జట్టు నెట్స్లో తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇంకో 24గంటల్లో.. శుక్రవారం రాత్రి జరగనున్న రెండో టీ20 నేపథ్యంలో.. గురువారం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ బౌలింగ్ మిషన్తో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
మంగళవారం రాత్రి ముగిసిన మ్యాచ్లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ 24 పరుగులిచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టేశాడు. ఇందులో ఒకే ఓవర్లోనే నాలుగు బంతుల వ్యవధిలో వరుసగా ఇయాన్ మోర్గాన్, జానీ బారిస్టో, జో రూట్ని అతను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో.. అప్పటి వరకు దూకుడుగా ఆడిన జోస్ బట్లర్ కాస్త నెమ్మదించాడు.
ఎంత జాగ్రత్తగా ఆడినా.. అతడ్ని కూడా కుల్దీప్ బోల్తా కొట్టించడంతో ఇంగ్లాండ్ 159/8కే పరిమితమైంది. లక్ష్యాన్ని భారత జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మాయాజాలంతో కూడిన బౌలింగ్, దుర్భేద్యమైన ఫీల్డింగ్, దూకుడుతో కూడిన బ్యాటింగ్లతో టీమ్ ఇంగ్లాండ్ను చిత్తు చేసి విజయం సొంతం చేసుకున్నారు. మ్యాచ్లో ఎక్కువగా గుడ్ లెంగ్త్ బంతులు విసురుతూ వచ్చిన కుల్దీప్ యాదవ్.. బంతిని కూడా ఎక్కువగా టర్న్ చేయలేదు.
కానీ.. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అలెక్స్ హేల్స్ బంతి టర్న్ అవుతుందనుకుని ఊహించి స్వీప్ షాట్ ఆడగా.. నేరుగా వెళ్లిన బంతి వికెట్లను గీరాటేసింది. మిగిలిన బ్యాట్స్మెన్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ని అర్థం చేసుకోలేకపోయారు. దీంతో.. టీ20 మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టిన తొలి ఎడమచేతి వాటం స్పిన్నర్గా కుల్దీప్ రికార్డుల్లో నిలిచాడు.