ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. తొలి మ్యాచ్ లో 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆతిథ్య జట్టు విండీస్ రెండో వన్డేలో మాత్రం చతికలపడింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ ఆది నుంచే వికెట్లను చేజార్చుకుంది. సామ్ కరన్ ధాటికి విండీస్ విలవిలలాడింది. 23 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అథంజె (4),క్యార్టీ (0), బ్రాండన్ కింగ్ (17), హెట్ మెయిర్ (0) వరుసగా పెవిలియన్ కు చేరారు.

అయితే షై హోప్ (68), షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్ (63) ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. అయిదో వికెట్ కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వీరిద్దరు స్వల్ప వ్యవధిలోనే ఔటవ్వడంతో వెస్టిండీస్ 39.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. సామ్ కరన్, లివింగ్ స్టోన్ చెరో మూడు, అట్కిన్ సన్, రెహాన్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు సాల్ట్ (21), జాక్స్ (73) ఆది నుంచి దూకుడుగా ఆడారు. వీరి ధాటికి ఆరు ఓవర్లలోపే స్కోరుబోర్డు 50 పరుగులు ధాటింది. అయితే క్రాలే (3), డకెట్ (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. కానీ బ్రూక్ (43*), బట్లర్ (58*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 32.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.
దీంతో మూడు వన్టేల సిరీస్ లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ 1-1 తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ శనివారం జరగనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ ను కైవసం చేసుకోని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.