సుమారు మూడేళ్ల నుంచి టీ20 ఫార్మాట్కు దూరంగా ఉంటూ వచ్చిన ఇంగ్లండ్ టెస్టు స్పెషలిస్టు జోరూట్.. మళ్లీ పొట్టి ఫార్మాట్ ఆడాలని ఉన్నట్లు చెప్పాడు. అందుకే వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. వచ్చే నెల ఐపీఎల్ మినీ వేలంలో తన పేరు కూడా నమోదు చేసుకోవాలని రూట్ ప్రయత్నిస్తున్నాడట. ఇదే విషయాన్ని జో రూట్ తాజాగా వెల్లడించాడు. టీ20 ఫార్మాట్కు చాలా దూరమైపోయాననే భావన కలుగుతోందని, ఈ ఫార్మాట్లో మరింత ఆడాలని ఉందని చెప్పాడు.
కొంతకాలంగా ఇంగ్లండ్ రెడ్ బాల్ జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్న రూట్.. టీ20 ఫార్మాట్లో కూడా 35.71 సగటుతో బ్యాటింగ్ చేశాడు. కానీ 2019 నుంచి ఈ ఫార్మాట్లో అతన్ని ఎక్కువగా ఆడించలేదు. అదే సమయంలో టెస్టు కెప్టెన్గా ఉన్న రూట్.. ఐపీఎల్కు కూడా దూరంగా ఉండిపోయాడు. దీంతో పొట్టి ఫార్మాట్కు అతను దూరమైపోయాడు. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన రూట్కు తీరిక సమయం దొరికిందట.. అందుకే మళ్లీ ఐపీఎల్లో అయినా ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
ఇదే విషయంపై మాట్లాడిన రూట్.. 'ఐపీఎల్ డ్రాకు వెళ్లాలని చాలా సీరియస్గా అనుకుంటున్నా. ఆ టోర్నమెంట్లో ఒక్కో మ్యాచ్ ఆడే కొద్దీ దాని స్థాయి పెరుగుతూ ఉంటుంది. దానిలో భాగం అవడం చాలా గొప్పగా ఉంటుంది' అన్నాడు. తనకు రిటైర్ అవ్వాలనే ఆలోచన ఏమాత్రం లేదన్న రూట్.. కొన్ని ఫార్మాట్లే ఆడాలని కానీ, తక్కువ మ్యాచులు ఆడాలని కానీ అనుకోవట్లేదన్నాడు. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ కూడా లేకపోవడంతో మరింత టైం దొరికిందని చెప్పాడు. టీ20ల్లో తనకు రెస్ట్ ఇస్తూనే వచ్చారని, దీంతో ఈ ఫార్మాట్కు చాలా దూరమైపోయాననే భావన కలుగుతోందన్నాడు. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ ఫార్మాట్లో మరింత ఆడేందుకు మంచి సమయం అని అభిప్రాయపడ్డాడు.