ఈ ఏడాది ఆరంభంలో అయిదు టెస్టుల సిరీస్ కోసం భారత్లో పర్యటించిన ఇంగ్లండ్ బాజ్బాల్ పద్ధతిని పక్కనపెట్టింది. టీమిండియా చేతిలో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తగా ఆడాలని నిర్ణయించుకుని వెనక్కితగ్గింది. కానీ ఇప్పుడు ఇంగ్లండ్ తిరిగి బాజ్బాల్ను అవలంభిస్తోంది. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో తిరిగి దూకుడు మంత్రాన్ని అందుకుంది. ఈ క్రమంలో టెస్టు చరిత్రలో కనివీని ఎరుగని రికార్డులు సృష్టించింది.
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన జట్టుగా చరిత్రను తిరగరాసింది. ఓపెనర్ బెన్ డకెట్ విధ్వంసం సృష్టించడంతో ఇంగ్లండ్ 4.2 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ను అందుకుంది. దీంతో మూడు దశాబ్దల క్రితం తమ జట్టే నెలకొల్పిన రికార్డును ఇంగ్లండ్ బద్దలుకొట్టింది.

టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన జట్టు జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఇంగ్లండ్ ఉంది. 2024లో వెస్టిండీస్పై (4.2 ఓవర్లలో) , 1994లో దక్షిణాఫ్రికాపై (4.3 ఓవర్లలో), 2002లో శ్రీలంకపై (5 ఓవర్లలో) ఇంగ్లండ్ వేగంగా 50 పరుగులు సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక (2004- పాకిస్థాన్పై 5.2 ఓవర్లలో), భారత్ (2008- ఇంగ్లండ్పై, 2008), భారత్ (2023 వెస్టిండీస్పై, 2023) ఉన్నాయి.
కాగా, ఇంగ్లండ్ చరిత్ర సృష్టించడంతో కీలక పాత్ర పోషించిన బెన్ డకెట్ అరుదైన ఘనత సాధించాడు. 32 బంతుల్లో అర్ధశతకం అందుకున్న డకెట్.. టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్ తరఫున అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇయాన్ బోథమ్ (28 బంతుల్లో, భారత్పై), జానీ బెయిర్స్టో (30 బంతుల్లో, న్యూజిలాండ్పై), ఇయాన్ బోథమ్ (32 బంతుల్లో, న్యూజిలాండ్పై) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
59 బంతుల్లో 71 పరుగులు సాధించిన బెన్ డకెట్ను షామర్ జోసెఫ్ ఔట్ చేశాడు. డకెట్ 14 ఫోర్లు బాదాడు. కాగా, ఇంగ్లండ్ పర్యటనలో వెస్టిండీస్ మూడు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో విండీస్పై ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.