
ఐర్లాండ్ ఇంటికే..
ఇవ్వాళ జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఐర్లాండ్ ఓడిపోయింది. సెమీ ఫైనల్స్ రేసు నుంచి వైదొలగింది. అఫీషియల్గా ఇంటిదారి పట్టిన తొలి జట్టు ఇదే. అదే సమయంలో ఐర్లాండ్పై విజయం సాధించడం ద్వారా ఈ టోర్నమెంట్లో సెమీ ఫైనల్స్ చేరిన మొదటి జట్టుగా ఆవిర్భవించింది న్యూజిలాండ్. గ్రూప్ 1లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం అయిదు మ్యాచ్లల్లో మూడు విజయాలతో ఏడు పాయింట్లను సాధించింది. వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దు కాగా.. ఇంకో దాంట్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది.

ఆస్ట్రేలియాకు నో ఛాన్స్..
ఇక మరో మ్యాచ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య నడుస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ 11 ఓవర్లల్లో రెండు వికెట్లు నష్టపోయి 79 పరుగుల మీద ఆడుతోంది. ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే 114 పరుగుల్లోపే ఆఫ్ఘనిస్తాన్ను ఆలౌట్ చేయాల్సి ఉంది గానీ.. అది సాధ్యపడట్లేదు. ఫలితంగా- టైటిల్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఆసీస్ సెమీస్ చేరే అవకాశాలను దాదాపుగా కోల్పోయినట్టే.

ఇంగ్లాండ్కే ఛాన్స్..
శనివారం జరిగే మరో మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు- శ్రీలంకను ఎదుర్కొనబోతోంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవడానికే అవకాశాలు ఉన్నాయి.. ఇప్పుడున్న ఈ రెండు జట్ల ఫామ్ను పరిగణనలోకి తీసుకుని చూస్తే. ఆస్ట్రేలియా 114 పరుగుల్లోపల ఆఫ్ఘనిస్తాన్ను ఆలౌట్ చేసే ఛాన్స్ లేనందున ఇంగ్లాండ్ సాధారణ విజయాన్ని సాధించినా సెమీ ఫైనల్స్ చేరుకుంటుంది. శ్రీలంక గెలిస్తే మాత్రం ఆ జట్టుకే సెమీ ఫైనల్స్ ద్వారాలు తెరచుకున్నట్టే.

టీమిండియా పరిస్థితేంటీ..?
ఈ టోర్నమెంట్లో టీమిండియా గ్రూప్ 2లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంకో మ్యాచ్ మిగిలేవుంది. ఆదివారం తన చివరి మ్యాచ్లో జింబాబ్వేతో తలపడాల్సి ఉంది రోహిత్ సేనకు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. నాలుగు మ్యాచ్లు మూడు విజయాలతో ఇప్పటికే టాప్ పొజీషన్లో ఉన్నందున సెమీ ఫైనల్స్ చేరుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

రోహిత్ సేన ప్రత్యర్థిగా..
ఆయా సమీకరణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. సెమీ ఫైనల్ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగడం ఖాయం. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లాండ్తో టీమిండియా ఈ నెల 10వ తేదీన అడిలైడ్ ఓవల్ స్టేడియంలో తలపడుతుంది. గ్రూప్ 2 టాపర్.. గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోరాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్ 2లో భారత్ అగ్రస్థానంలో ఉన్నందున గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచే ఇంగ్లాండ్ను ఢీ కొట్టాల్సి ఉంటుంది. గ్రూప్ 1 టాపర్ న్యూజిలాండ్- గ్రూప్ 2 సెకెండర్ను ఎదుర్కొంటుంది. ఆ స్థానంలో దక్షిణాఫ్రికా నిలిచే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications
