
హైదరాబాద్: యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో బస చేస్తున్నారు. అయితే ఇదే నగరంలో అవాంచనీయ రోడ్డు ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో కలవరపాటుకు గురైన జట్టు అభిమానులు ఏమైందోనన్న ఆందోళనలో పడ్డారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీడియాలో రావడంతో ఏమీ కాలేదన్న సంగతి తెలిసింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 14మంది గాయపడ్డారు. పలువురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
తెలుపు రంగు సుజుకీ ఎస్యూవీ వాహనంలో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా వాహనంతో దూసుకువచ్చారు. అదే సమయంలో పాదచారులు రోడ్డు దాటుతుండటంతో వాహనం వారిని గుద్దింది. దీంతో అక్కడి పరిసరాలు భీతావాహంగా మారాయి. నిందితులిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే వీరు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.
ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వాహకులు... ఆటగాళ్లు, మేనేజ్మెంట్ సిబ్బంది క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటన విడుదల చేసింది. దీంతో అభిమానులు వూపిరి పీల్చుకున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.