లండన్: పాకిస్థాన్తో జరగబోయే మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం 14 మందితో కూడిన జట్టుని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లోని ఏ ఆటగాడికీ సెలక్టర్లు చోటివ్వలేదు. టీ20 సిరీస్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. మొయిన్ అలీ, బెయిర్స్టో, శామ్ బిల్లింగ్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్ తమ స్థానాలను నిలుపుకున్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోసం బయో బబుల్లో ఉన్న ఆటగాళ్లను టీ20 టీంలో చేర్చలేదు అని సెలెక్టర్ ఎడ్ స్మిత్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వాలనుకున్నాం, అయినా ప్రతి సిరీస్కు పటిష్టమైన స్క్వాడ్లను ఎంచుకున్నామన్నారు. టీ20 సిరీస్కు అసిస్టెంట్ కోచ్ గ్రాహం తోర్పే ప్రధాన కోచ్ పాత్రను పోషించనున్నట్లు ఈసీబీ ధృవీకరించింది. పాల్ కాలింగ్ వుడ్ అసిస్టెంట్ కోచ్గా, మార్కస్ ట్రెస్కోతిక్ బ్యాటింగ్ కోచ్గా నియమితులయ్యారు.
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఈ నెల 28 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో మూడు మ్యాచ్లూ అదే వేదికగా ఈసీబీ నిర్వహిస్తుంది. వరుసగా 28, 30, సెప్టెంబరు 1న టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్ పక్కనే అందుబాటులో హోటళ్లు ఉండడంతో ఈసీబీ అదే వేదికను ఎంచుకుంది. అన్ని మ్యాచులు ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు.
ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య ఈ నెల 5న మూడు టెస్టుల సిరీస్ ప్రారంభమయింది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. మాంచెస్టర్లో జరిగిన తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించగా.. రెండో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టు మ్యాచ్ సౌథాంప్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్ టీ20 జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్స్టో, టామ్ బాటన్, శామ్ బిల్లింగ్స్, టామ్ కరన్, జో డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, క్రిస్ జోర్దాన్, షకీబ్ మహ్మద్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ.
Suresh Raina: రైనా టాపార్డర్లో ఆడి ఉంటే మరిన్ని పరుగులు చేసేవాడు: ద్రవిడ్