
ముంబై: ఐదు టెస్టుల సిరీసులో భాగంగా లార్డ్స్ వేదికగా భారత్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు జస్ప్రీత్ బుమ్రాతో అనవసరంగా పెట్టుకున్నామని పశ్చాత్తాపం చెంది ఉంటుందని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లను రెచ్చగొట్టి మరి ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుందన్నాడు. బుమ్రా ప్రపంచశ్రేణి బౌలర్ అని, అతడికి కోపమొస్తే ఇలాంటి ప్రదర్శనే చేస్తాడని జహీర్ ఖాన్ అన్నాడు. రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో గెలిచి.. ఐదు టెస్టుల సిరీసులో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్లో ఈనెల 25 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
లార్డ్స్ టెస్టులో భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్న సంగతి తెలిసిందే. మూడో రోజు బ్యాటింగ్కు వచ్చిన జేమ్స్ అండర్సన్కు జస్ప్రీత్ బుమ్రా షార్ట్ పిచ్ బంతులు వేయడంతో అసలు కథ మొదలైంది. కొన్ని బంతులు దేహానికి తగలడంతో జిమ్మీ ఆవేశపడ్డాడు. అతడికి సారీ చెబుదామని వెళ్లిన బుమ్రాను తోసేసి బూతులు తిట్టాడు. ఇది అన్యాయమని, కావాలనే బంతులు వేశావని రెచ్చగొట్టాడు. ఆ తర్వాతి రోజు బ్యాటింగ్కు వచ్చిన బుమ్రాకు ఇంగ్లండ్ పేసర్లు షార్ట్ పిచ్ల బంతులు విసిరి గాయపర్చాలని భావించారు. ఆ క్రమంలోనే మాటల దాడి చేశారు.
ఇంగ్లండ్ ప్లేయర్స్ మాటల దాడి చేసినా.. రెండో ఇన్నింగ్స్లో బుమ్రా, షమీ ఎనిమిదో వికెట్కు 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అప్పుడు కూడా మార్క్ వుడ్ నోటికి పని చెప్పాడు. అలా ఇంగ్లండ్ ఆటగాళ్లు పలు సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం చివరి రోజు ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్కు దిగిన వేళ బుమ్రా బంతితో మెరిశాడు. మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా తన కోపాన్ని సరైన ఆటతీరుతో చూపించాడని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
'జస్ప్రీత్ బుమ్రాకు కోపమొస్తే ఇలాంటి ప్రదర్శనే చేస్తాడు. కొన్నిసార్లు ప్రత్యర్థికి ధీటుగా బదులివ్వాల్సి ఉంటుందని నేను బలంగా నమ్ముతా. అతడు ప్రపంచశ్రేణి బౌలర్ అయినా.. తొలి ఇన్నింగ్స్లో వికెట్ తీయలేదు. అలాంటిది జేమ్స్ అండర్సన్తో వివాదం జరిగాక రెండో ఇన్నింగ్స్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకుముందు ఎదురైన అనుభవాలన్నీ అతడిలో కసిని పెంచాయి. దాంతో బౌలింగ్లోనూ తన చాతుర్యం ప్రదర్శించి వికెట్లు తీసాడు. అతడు బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. చివరికి బుమ్రా ఆతిథ్య జట్టు ఓటమికి ప్రధాన కారణం అవడంతో.. ఇప్పుడా జట్టు పశ్చాత్తాపం చెంది ఉంటుంది' అని జహీర్ ఖాన్ అన్నాడు.
భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... '11వ నంబర్ ఆటగాడు జేమ్స్ అండర్సన్కు జస్ప్రీత్ బుమ్రా 150 మైళ్ల వేగంతో బంతులు వేశాడు. పుల్ లెంగ్త్, షార్ట్ పిచ్ బంతులతో దేహానికి గురిపెట్టాడు. అప్పటివరకు 140-145 మైళ్ల వేగంతో బంతులు సంధించే పేస్ గుర్రం ఒక్కసారిగా వేగం పెంచాడు. సాధారణంగా ఇది బుమ్రా స్వభావం కాదు. అతడు వేగంగా బంతులేస్తూ వికెట్లకు గురిపెడతాడు. అలా చేసుంటే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఇంకా త్వరగానే ముగిసేది. షార్ట్ పిచ్ బంతులు వేయాలన్నది బహుశా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రణాళిక అయ్యుంటుంది. దానిని పేసర్ బుమ్రా అమలు చేశాడు. బహుశా ఇంగ్లండ్ ప్రధాన ఆటగాడైన అండర్సన్ను రెచ్చగొట్టాలనో లేదా రెచ్చగొట్టి శాంతింపజేయాలనో లేదా అతడిని గాయపర్చాలనో ఇలా చేసుండొచ్చు. దాంతో ఇంగ్లీష్ ప్లేయర్స్ డీలా పడతారని అనుకోవచ్చు' అని అన్నాడు.