ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో యాషెస్ టెస్టులో కూడా ఇంగ్లండ్ బజ్బాల్ కుదేలైంది. తొలి టెస్టులో బజ్బాల్ అప్రోచ్ వల్లనే ఓడిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్లో కూడా అదే పద్ధతిని కొనసాగించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పట్టుదలగా ఆడటంతో ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లండ్ వెనుకపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ (105), ట్రావిస్ హెడ్ (77), డేవిడ్ వార్నర్ (66) ముగ్గురూ రాణించడంతో భారీ స్కోరు చేసింది. 416 పరుగుల స్కోరుకు ఆలౌట్ అయింది. అనంతరం బరిలో దిగిన ఇంగ్లండ్ తమ బజ్బాల్ విధానంతో ఆడేందుకు ప్రయత్నించి చేతులెత్తేసింది. టెస్టుల్లో నెంబర్ వన్ జట్టు బౌలర్లపై ఎదురు దాడి చేయడం అంత ఈజీ కాదని ఆసీస్ నిరూపించింది.

ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో ఈ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 325 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ (98), హ్యారీ బ్రూక్ (50), జాక్ క్రాలీ (48) తదితరులు ఫర్వాలేదనిపించారు. అయితే ఆసీస్ బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో ఇంగ్లండ్ తడబడింది. అనంతరం మళ్లీ బ్యాటింగ్ చేసిన ఆసీస్లో ఉస్మాన్ ఖవాజా (77) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు.
ఖవాజా కీలకమైన ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా 279 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బరిలో దిగిన ఇంగ్లండ్కు ఆసీస్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించారు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఇద్దరూ బంతితో చెలరేగారు. దీంతో జాక్ క్రాలీ (3), ఓలీ పోప్ (3), జో రూట్ (18), హ్యారీ బ్రూక్ (4) తేలిపోయారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 279 పరుగులు వెనుకపడి ఉంది.