ఎడ్జ్బాస్టన్: తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో చేసినట్లుగానే రెండో ఇన్నింగ్స్లోనూ కోహ్లి ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 274 పరుగులు చేస్తే అందులో కోహ్లి చేసినవే 149 రన్స్ ఉండటం గమనార్హం. ఇంగ్లిష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న విరాట్.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశాడు. టెయిలెండర్లతో సైతం పరుగులు రాబట్టి జట్టుకు ఆసరాగా నిలిచాడు. ఇదే పంథాలో రెండో ఇన్నింగ్స్లోనూ ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్లో కోహ్లి పాతుకుపోయాడు.
ఇలా ఇంగ్లాండ్ విజయానికి అడ్డుగా నిలిచిన కోహ్లీపైనే రెండో ఇన్నింగ్స్ కూడా ఆధారపడి ఉంది. ఇదిలా ఉంటే, రెండో ఇన్నింగ్స్లో ముగ్గురు భారత బ్యాట్స్మెన్ 13 పరుగుల వద్ద వెనుదిరిగారు. ఓపెనర్ శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ ఇద్దరూ సరిగ్గా 24 బంతుల్లో 13 రన్స్ చేసి అవుటయ్యారు. దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యల కంటే ముందుగా బ్యాటింగ్కి దిగిన అశ్విన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. 15 బంతుల్లోనే 13 పరుగులు చేసి అవుటయ్యాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 110/5తో నిలవగా.. ముగ్గురు బ్యాట్స్మెన్ 13 పరుగుల వద్దే పెవిలియన్ చేరారు. ముగ్గురు భారత బ్యాట్స్మెన్ ఒకే ఇన్నింగ్స్లో 13 పరుగుల వద్ద అవుటవడం ఇదే తొలిసారి. 13 అంకెను పాశ్యాత్యులు అశుభంగా భావిస్తారు. ఓవరాల్గా టెస్టుల్లో ఇది ఏడోసారి కాగా, నాలుగో ఇన్నింగ్స్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం. 1991 తర్వాత కూడా టెస్టుల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఇలా జరిగిన సమయంలో న్యూజిలాండ్ మాత్రమే విజయం సాధించింది. అది కూడా భారత్పైనే. ప్రస్తుతం క్రీజులో ఉన్న టీమిండియా బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్లపైనే ఫలితం ఆధారపడి ఉంది.