హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియా రెండో సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్తో కీలకమైన మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. సోమవారం నెట్స్లో తీవ్ర సాధన చేసింది. గాయంతో వన్డేలకు దూరమైన పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టుతో కలిసి సాధన చేశాడు. సహచరులకు బౌలింగ్ చేశాడు. మ్యాచ్లోపు అతడు ఫిట్ అయితే భారత్ ఎదుర్కొంటున్న డెత్ ఓవర్ల సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.
శార్దూల్ ఠాకూర్, ధోనీ, రైనాతో కలిసి భువి మైదానంలో సాధన చేశాడు. భువి రాకతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారినా మిడిలార్డర్ విభాగం మాత్రం సమస్యగానే కనిపిస్తోంది. తొలి వన్డేలో దుమ్ము దులిపేసిన టాప్ ఆర్డర్ రెండో వన్డేలో కుప్పకూలడంతో మిడిలార్డర్ వైఫల్యం మరోసారి బయటపడింది. ధోనీ చాలా నెమ్మదిగా ఆడాడు. రైనా ఫర్వాలేదనిపించాడు. ఇక మిగిలినవారు కనీసం సింగిల్స్ తీయడానికీ కష్టపడ్డారు.
టీ20ల్లో మిడిలార్డర్ను పటిష్ఠం చేసేందుకు కెప్టెన్ కోహ్లీ నాలుగో స్థానంలో ఆడాడు. మూడో స్థానంలో కేఎల్ రాహుల్ను పంపించాడు. వన్డేల్లో మాత్రం కోహ్లీ వన్డౌన్లో వస్తూ రాహుల్ను నాలుగో స్థానంలో ఆడిస్తున్నాడు. ఆ తర్వాత రైనా, ఎంఎస్ ధోనీ, హార్దిక్ క్రీజులోకి వస్తున్నారు. అందరూ రాణిస్తే ఫర్వాలేదు. కానీ టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు మిడిలార్డర్ సత్తా చాటలేకపోవడం ఇబ్బందిగా ఉందని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అంటున్నారు.
ఈ సమస్యని త్వరగానే అధిగమిస్తామని ఆయన ధీమాగా ఉన్నాడు. ఇదే నిర్ణయాత్మక మ్యాచ్ కావడంతో ఇరు జట్లు గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్ విజయం తర్వాత జరగనున్న టెస్టు సిరీస్కు మరింత ప్రోత్సాహం తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.