వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ వరుసగా ఘన విజయాలు సాధిస్తోంది. మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. విండీస్ ఘోర పరాజయాలు చవిచూడంతో ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దూసుకెళ్తోంది. మరోవైపు ఇది ఇతర జట్లకు ఇది ప్రతికూలత ప్రభావాలు చూపిస్తోంది.
2023 నుంచి 2025 వరకు జరుగనున్న టెస్టు మ్యాచ్ల విజయాల శాతం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్కు రెండు జట్లు అర్హత సాధిస్తాయి. ఈ మూడో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో తొమ్మిది జట్లు పాల్గొంటున్నాయి. పాయింట్ల పట్టికలలో అంతిమంగా టాప్-2లో నిలిచిన జట్లు జూన్లో జరగనున్న ఫైనల్లో తలపడతాయి. ఈ పోరులో విజేతగా నిలిచిన జట్టు టెస్టు ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలుస్తుంది.

తొలి రెండు డబ్ల్యూటీసీల్లో భారత్ ఫైనల్కు చేరింది. కానీ టైటిల్ను గెలవలేకపోయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. ఈ సారి విజేతగా నిలవాలని పట్టుదలతో మ్యాచ్లు గెలుస్తోంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలతో భారత్ టాప్లో నిలిచింది. 68.51 విజయశాతంతో టాపర్గా నిలిచింది. తొమ్మిది మ్యాచ్లు ఆడిన భారత్ ఆరింట్లో గెలిచి, రెండింట్లో ఓటమిపాలైంది. ఓ మ్యాచ్ను డ్రాగా ముగించింది.
ఇదే జోరును కొనసాగిస్తే భారత్ మూడో సారి ఫైనల్కు వెళ్లడం ఖాయం. సెప్టెంబర్ నుంచి టీమిండియా బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లు ఆడనుంది. స్వదేశంలో రోహిత్ సేన హాట్ ఫేవరేట్. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్లో ఘోరపరాజయాన్ని పొందకపోతే టీమిండియా సునాయాసంగా ఫైనల్కు చేరుతుంది. ఇక పోటీ అంతా రెండో స్థానం గురించే.
ప్రస్తుతం భారత్ (68.51%), ఆస్ట్రేలియా (62.5 %), న్యూజిలాండ్ (50 %), శ్రీలంక (50 %) టాప్-4లో ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఆరంభంలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ ఫైనల్పై ఆశలు వదిలేసుకుంది. కానీ వెస్టిండీస్ చిత్తుగా ఓడటంతో ఇంగ్లండ్ తిరిగి పోటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్ (31.25 %) ఆరో స్థానంలో ఉంది. వెస్టిండీస్తో జరిగే ఆఖరి మ్యాచ్లోనూ గెలిస్తే అయిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ (36.66 %)ను ఇంగ్లండ్ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్తో ఇంగ్లండ్ టెస్టు సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్ల్లో గెలిస్తే ఇంగ్లండ్ తుదిపోరు రేసులో ఫేవరేట్గా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అక్టోబర్లో న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ను భారత్ గెలిచే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే కివీస్కు ప్రతికూలంగా, ఇంగ్లండ్కు సానుకూలంగా మారుతుంది. స్వదేశంలో జరిగే శ్రీలంక, పాకిస్థాన్ను ఇంగ్లండ్ సునాయాసంగా గెలవొచ్చు. దీంతో టాప్-2 కోసం భారత్, ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ కూడా గట్టిగానే పోటీ పడే అవకాశం ఉంది.