వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ టేబుల్లో ఇంగ్లండ్ క్రమంగా తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటుంది. నెల రోజుల క్రితం ఏడో స్థానంలో నిలిచిన ఇంగ్లిష్ జట్టు వరుస విజయాలతో టాప్-4లోకి దూసుకొచ్చింది. స్వదేశంలో ఇటీవల వెస్టిండీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. శ్రీలంకపై పైచేయి సాధిస్తోంది.మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అయిదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి మూడు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇంగ్లండ్ జోరు చూస్తుంటే ఈ సిరీస్ను 3-0తో తమ ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ దూకుడు ఇతర జట్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ ఫైనల్పై ఆశలు వదిలేసుకుంది. కానీ వరుస విజయాలతో ఫైనల్ రేసులోకి తిరిగొచ్చింది. ప్రస్తుతం భారత్ (68.52%), ఆస్ట్రేలియా (62.50%), న్యూజిలాండ్ (50 %), ఇంగ్లండ్ (41.07 %) టాప్-4లో ఉన్నాయి.

2023 నుంచి 2025 వరకు జరుగనున్న టెస్టు మ్యాచ్ల విజయాల శాతం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్కు రెండు జట్లు అర్హత సాధిస్తాయి అనే విషయం తెలిసిందే. పట్టికలో అంతిమంగా టాప్-2లో నిలిచిన జట్లు జూన్లో జరగనున్న ఫైనల్లో తలపడతాయి. అగ్రస్థానంలో ఉన్న భారత్ తుదిపోరుకు అర్హత సాధించడం దాదాపు ఖాయమే. బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో భారత్ స్వదేశంలో టెస్టు సిరీస్లు ఆడనుంది. ఆ తర్వాత కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది. భారత్ జోరు చూస్తుంటే టాపర్గా నిలవడం ఖాయమే.
ఇక పోటీ అంతా రెండో స్థానం గురించే. న్యూజిలాండ్.. భారత్తో మూడు, శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. శ్రీలంక సిరీస్ను కైవసం చేసుకుని, టీమిండియాను ప్రతిఘటిస్తే కివీస్ తన పర్సంటేజ్ను మెరుగుపర్చుకుంది. ఇక ఆస్ట్రేలియా.. భారత్తో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో ఆసీస్ చిత్తుగా ఓడితే రెండో స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరోవైపు ఇంగ్లండ్.. శ్రీలంకతో సిరీస్ ముగిసిన అనంతరం పాకిస్థాన్తో మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. లంక, పాక్లపై ఓటమెరుగకుండా సత్తాచాటితే ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది.