
హైదరాబాద్: 142 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మరో అపురూపమైన ఘట్టానికి తెరలేవబోతోంది. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమయ్యే యాషెస్ టెస్టు సిరిస్లో ఇరు జట్ల ఆటగాళ్ల జెర్సీలపై నెంబర్లతో పాటు పేర్లను కూడా ముద్రించనున్నారు. ఇలా ఆటగాళ్లు తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపిండం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
సాధారణంగా వన్డేల్లో ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపై పేర్లు ముద్రించబడి ఉంటాయి. వీటితో పాటు వారు ఎంచుకున్న జెర్సీ నెంబర్లు కూడా ఉంటాయి. జెర్సీపై 10 ఉంటే సచిన్ అని, 7 ఉంటే ధోని అని, 18 ఉంటే కోహ్లీది అని అభిమానులు ఠక్కున చెప్పేస్తారు. అయితే, టెస్టుల్లో మాత్రం ఇందుకు భిన్నం. టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు ఏ మ్యాచ్లోనూ ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, అంకెలు కనిపించింది లేదు.
టెస్టుల్లో ఆడే ఆటగాళ్లు కేవలం తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలు ధరిస్తారు. జెర్సీ వెనుక భాగంలో ఖాళీగా ఉంటుంది తప్ప, నంబర్లు ఉండవు. అంతేకాదు టెస్టుల్లో టాస్ వేసేటప్పుడు ఇరు జట్ల కెప్టెన్లు బ్లేజర్లతో వెళ్లాలి. వన్డేల్లో మాత్రం అలా కాదు. అయితే, యాషెస్ టెస్టు సిరీస్తో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు.
అటు ఆస్ట్రేలియా, ఇటు ఇంగ్లాండ్ జట్లకు చెందిన ఇరు జట్ల ఆటగాళ్లు యాషెస్ టెస్టు సిరిస్లో పేర్లు, నంబర్లతో కూడిన జెర్సీలను ధరించి బరిలోకి దిగనున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ టెస్టు సిరిస్కు సంభంధించి ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ధరించిన టెస్టు జెర్సీపై నెంబర్, పేరుతో ఉన్న ఫొటోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన ట్వీటర్లో పోస్టు చేసింది. టెస్టు జెర్సీపై నెంబర్, పేరు ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే అయితే ఈ ఐడియా బాగుందని ట్విట్టర్లో పోస్టు చేశాడు.