హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాఫర్ అన్సారీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్నే శ్వాసగా బ్రతికిన అన్సారీ ఇకపై క్రికెట్ ఆడనంటూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్ అనేది తన జీవితంలో ఒక భాగంగానే మిగిలిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎంతో భవిష్యత్తు ఉన్న అన్సారీ 25 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడానికి వేరే లక్ష్యాలు ఉండటమే కారణమని అన్సారీ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. గతేడాది అక్టోబర్లో బంగ్లాదేశ్ పర్యటనలో అన్సారీ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.

ఆల్రౌండర్గా పేరొందిన అన్సారీ భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్తో జరిగిన టెస్టు సిరిస్లో రెండు టెస్టు మ్యాచ్లు కూడా ఆడాడు. దాదాపు ఏడేళ్ల పాటు ప్రొఫెషనల్ క్రికెటర్గా ఉన్నా ఇది మాత్రం కచ్చితంగా వీడ్కోలు సమయమేనని అన్సారీ పేర్కొనడం విశేషం.
'నాకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడ్నుంచి సర్రే జట్టుకు ఆడుతున్నా. ఇలా ఒక్కసారిగా వీడ్కోలు తీసుకోవడం బాధాకరమే. కాకపోతే నా జీవితంలో క్రికెట్ ఒక భాగం మాత్రమే. నేను పూర్తి చేయాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. ఆ క్రమంలోనే క్రికెట్ వీడ్కోలు నిర్ణయం' అని అన్సారీ తెలిపాడు.
ప్రస్తుతం న్యాయశాస్త్రం చదివేందుకు సిద్ధమవుతున్న తరుణంలో క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అన్సారీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ తరుపున మూడు టెస్టు మ్యాచ్లు ఆడిన అన్సారీ 49 పరుగులు చేసిన 5 వికెట్లు తీశాడు. 2015లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో అన్సారీ వన్డే అరంగేట్రం చేశాడు.