
బర్మింగ్హామ్: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరలా మూడో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జో డెన్లీ తెలిపాడు. ఆగస్టు 1 నుండి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ తలపడనుంది. టెస్టు ఛాంపియన్షిప్ను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు యాషెస్ 2019 సిరీస్తో ప్రారంభించనున్నాయి. ప్రపంచకప్ గెలిచి మంచి ఊపులో ఉన్న ఇంగ్లాండ్ ఈ సిరీస్ కూడా గెలవాలని భావిస్తోంది. అందుకు తగిన విధంగా ఇంగ్లీష్ బోర్డు జట్టులో మార్పులు చేస్తోంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ తొలి టెస్టులో జో రూట్ తిరిగి మూడో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. నాలుగో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తానని గతంలో చెప్పిన రూట్.. ఐర్లాండ్తో టెస్టు మ్యాచ్ తర్వాత మనసు మార్చుకుని ఎప్పటిలా మూడో స్థానంలో దిగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో జో డెన్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు.
జో డెన్లీ మాట్లాడుతూ... 'జో రూట్ మూడో స్థానంలో, నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తాం. రూట్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నా అని నాతో చెప్పాడు. మ్యాచ్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తా. తుది 11 మందిలో ఉండడం సంతోషంగా ఉంది. గతంలో కూడా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశా కాబట్టి ఇది నాకు పెద్ద సమస్య కాదు' అని డెన్లీ పేర్కొన్నాడు.
యాషెస్ చరిత్రలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు గొప్ప రికార్డులు కలిగి ఉంది. కానీ కంగారుల జట్టు 2001 నుండి ఇంగ్లీష్ గడ్డపై యాషెస్ సిరీస్ గెలవలేదు. దీంతో ఈసారి సిరీస్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. నిషేధం అనంతరం డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులోకి తిరిగి రావడంతో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రపంచకప్ గెలిచి ఇంగ్లాండ్ మంచి ఊపులో ఉంది. దీంతో యాషెస్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.