
పూణే: భారత్తో జరిగిన తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. వన్డే సిరీస్లోని మిగతా రెండు మ్యాచులకు దూరమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు పగ్గాలు జోస్ బట్లర్ అందుకోనున్నాడు. మోర్గాన్ స్థానంలో లియామ్ లివింగ్స్టోన్ వన్డేలో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు తొలి మ్యాచులో గాయపడిన సామ్ బిల్లింగ్స్ రెండో వన్డేకు దూరమవగా.. మూడో వన్డే ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆదివారం జరిగే మూడో మ్యాచ్ సమయానికి బిల్లింగ్స్ ఆడడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
'ఈ రోజు ప్రాక్టీస్ చేయడానికి డ్రెస్ వేసుకున్నాను. కానీ గాయాన్ని కాపాడుకోవడానికి ప్రాక్టీస్ చేయలేదు. ఈ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్లో దాచడానికి ఏమీ లేదు. ముఖ్యంగా పరిమిత ఓవర్ ఫార్మాట్లలో. మరో ఆలోచన లేకుండా నేను తప్పుకుంటున్నా. ఇది ఒక విచిత్రమైన గాయం. గాయం చాలా నిరాశపరిచింది కాని నేను ఏమీ చేయలేను. జోస్ బట్లర్ మీద నాకు నమ్మకం ఉంది. అతడు జట్టును బాగా నడిపిస్తాడు. మిగతా ఆటగాళ్లు బాగా ఆడతారు' అని ఇయాన్ మోర్గాన్ ధీమా వ్యక్తం చేశాడు.
భారత్ ఇన్నింగ్స్ సందర్బంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఇయాన్ మోర్గాన్.. వెంటనే మైదానం వీడాడు. మోర్గాన్ బొటన, చూపుడు వేళ్ల మధ్యలో కుట్లు వేయాల్సి వచ్చింది. ఇక నొప్పితో ఇబ్బంది పడుతూనే అతడు బ్యాటింగ్ కొనసాగించాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మోర్గాన్ 22 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బందిగా మారడంతో.. చివరి రెండు వన్డేల నుంచి స్వయంగా తప్పుకున్నాడు.
ఇక బౌండరీ ఆపే క్రమంలో సామ్ బిల్లింగ్స్ భుజానికి గాయమైంది. అతని ఎడమ భుజం డిస్ లొకేట్ కావడంతో అతను కూడా మైదానం వీడాడు. బ్యాటింగ్కు దిగినా ఇబ్బంది పడుతూనే ఆటను కొనసాగించాడు. 18 పరుగులు చేసి అరంగేట్ర బౌలర్ ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. బిల్లింగ్స్ రెండో వన్డేకు దూరమవగా.. మూడో వన్డే ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఫిట్నెస్ సాధిస్తే మూడో వన్డే ఆడతాడు. డేవిడ్ మలన్ అందుబాటులో ఉన్నాడు. రెండో వన్డే రేపు పూణే వేదికగా జరుగనుంది.