
సిడ్నీ: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఓ ఆటగాడు అభిమానికి గుండుపై ఆటోగ్రాఫ్ ఇవ్వడం వైరల్గా మారింది. అసలు ఏం జరిగిందంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా యాషెస్ సిరీస్లోని నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట సగం వర్షంతోనే నిలిచిపోయింది. ఇక రెండో రోజు పూర్తి ఆట కొనసాగగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించింది. 8 వికెట్ల నష్టానికి 416 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అయితే రెండో రోజు ఆట కొనసాగుతుండగా ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇంతలో కొందరు అభిమానులు జాక్లీచ్ను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరారు. ఓ అభిమాని తన బట్టతలపై ఆటో గ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. దీంతో ఆ అభిమాని కోరికను కాదనలేని జాక్లీచ్ అతను అడిగినట్టుగా తలపైనే ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. మొదట్లో జాక్ లీచ్ చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయిన ఇతర అభిమానులు.. ఆ తర్వాత చప్పట్లతో లీచ్ను అభినందించారు.
ఇక సిడ్నీ టెస్టు మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగాడు. మొత్తం 13 ఫోర్లతో 137 పరుగులు సాధించాడు. ఖవాజాకు తోడుగా స్టీవెన్ స్మిత్ 67 పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్లో 5 ఫోర్లు ఉన్నాయి. మిగతా వారిలో మార్కస్ హరీస్ 38, స్టాక్ 34, వార్నర్ 30, కమిన్స్ 24, అలెక్స్ కారీ 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 5 వికెట్లతో చెలరేగాడు. అండర్సన్, వుడ్, రూట్ తలో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది. మూడో రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలే 18, హసబ్ హమీద్ 6, డేవిడ్ మలాన్ 3 పరుగులు చేశారు. కాగా కెప్టెన్ జో రూట్ డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 2, మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీశారు. కాగా ఇప్పటికే యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.